ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార నివాసానికి కూతవేటు దూరంగా ఉన్న, కరోనా వైరస్ వ్యాప్తిలో రెడ్ జోన్ గా భావిస్తున్న విజయవాడ నగరంలో లాక్డౌన్ ప్రభావం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి రోజు సమీక్ష జరుపుతున్నా, ఉన్నతాధికారులు అందరు సమీపంలో ఉన్నా ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
విజయవాడ నగరంలో ఇప్పటికే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. అయినప్పటికీ జనం భౌతిక దూరాన్ని పాటించడం లేదు. ప్రధాన రోడ్లపై గుంపులు గుంపులుగా జనం సంచరిస్తున్నారు. రోడ్లపై వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పోలీసులు కేసులు పెట్టినా, వాహనాలను సీజ్ చేసినా జనం తీరు మారడం లేదు.
ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం నిర్ణీత సమయాన్ని ఇచ్చినప్పటికీ.. సమయం దాటిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జనం రోడ్లపై తిరుగుతున్నారు. ఈ విషయమై పోలీసులు సహితం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
28 రోజులలోపు గృహ నిర్బంధంలో 1450 మంది ఉన్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్లో 32 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 440 మంది నమూనాలు తీసుకున్నారు. వీరిలో 29 మందికి పాజిటివ్ వచ్చింది. 221 మంది రిపోర్టులు రావల్సి ఉంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఒకరు ఒకరు కరోనా పాజిటివ్ లక్షణాలతో చనిపోయారు.
లాక్డౌన్ ను మరింత పకడ్బందీగా అమలు జరపని పక్షంలో ఈ వైరస్ మరింత పెరిగే అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పనుల సాకుతో రోడ్లపై తిరుగుతున్న యువతను కట్టడి చేయవలసిన పరిస్థితి నెలకొంది.