స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు ఎవ్వరి ఇష్టం వచ్చిన భాష్యాన్ని వారు చెప్పుకొంటున్నారు. ఎన్నికల వాయిదాను సమర్ధించినా, ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని ఆక్షేపించినట్లు వైసిపి నేతలు చెబుతూ ఉంటె, అదేమీ కాదని తిరిగి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నిర్ణయమైనా తర్వాత రాష్త్ర ప్రభుత్వానికి తెలిపామని మాత్రమే చెప్పిన్నట్లు టిడిపి నేతలు భాష్యం చెబుతున్నారు.
ఏది ఏమైనా, తిరిగి ఎన్నికల నిర్వహణ ఎక్కడి నుండి ఆగిందో అక్కడి నుండే ప్రారంభించి చేబడతారా లేదా మళ్ళి – తాజాగా నామినేషన్లు దాఖలు నుండి ప్రారంభిస్తారా అనే సమస్య ఇప్పుడు తెరపైకి వస్తున్నది. సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక సాధారణ పరిస్థితుల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిందని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్ తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎన్నికల నియమావళి అమలును రద్దు చేసింది. అంతేగాక ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాలు ఎన్నికల నియమావళి అమలులో ఉండేలా చూడాలని సూచించిచింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
పైగా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కేంద్ర హోమ్ కార్యదర్శికి రాసిన లేఖ సహితం అందుకు బలం చేకూరుస్తుందని చెబుతున్నారు.రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు అవసరమని, లేదంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ ఆ లేఖలో స్పష్టం చేయడం గమనార్హం.
అంతేగాక రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కేంద్రానికి గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఘర్షణలు, ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు చేయకుండా ఆటంకం కల్పించారని కమిషన్కు పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో న్యాయస్థానాలు కూడా కమిషనర్ రమేష్కుమార్కు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.