Pawan Kalyan: వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయడమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ విముక్త ఏపీ కోసమే ఎన్నికల్లో పోరాటం చేస్తామన్నారు. వైసీపీ విముక్త ఏపీ జరగకపోతే తెలంగాణ కూడా నష్టపోతుంది. వైసీపీతో తేల్చుకుంటాం. వైసీపీనీ గద్దె దించుతాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. కులం, మతం , ప్రాంతం అని కొట్టుకుంటుంటే అభివృద్ధి ఎక్కడుంటుంది? దీనిపై ప్రజలు కూడా ఆలోచించాలి’ అని పవన్ కళ్యాణ్ కోరారు.
మోడీ తెలుసు, అమిత్ షాగారు తెలుసు అని చిన్న పిల్లాల్లా మమ్మీ డాడీ అంటూ తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయలేను కదా.? వైసీపీ వాళ్లు ఇలా చేశారని ఫిర్యాదు చేయలేం కదా? మాకు ధైర్యం ఉందని.. మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో తెలుసు అంటూ కేంద్రం తమకు సపోర్టుగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ అధికార వైసీపీకి హెచ్చరికలు పంపారు.
ఏపీలో వైసీపీ దౌర్జన్యాలు, దోపిడీలకు తట్టుకోలేక చాలా మంది తెలంగాణకు వెళ్లిపోతున్నారని.. ఇలాగే వైసీపీ ఉంటే ఏపీలో ఎవరూ మిగలరని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎలాగైతే యువత బలిదానాలు చేసి మరీ సాధించుకున్నారో ఆస్ఫూర్తితో ఏపీ ప్రజలు, యువత పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఈ దమనకాండకు బాధితులుగా తనతోపాటు ఏపీ ప్రజలు మిగిలిపోతున్నారని.. గొంతెత్తినవారిపై కేసులు, అరెస్ట్ లు, జైలు పాలు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని.. దయచేసి ఏపీ బాగు కోసం మీడియా, యూట్యూబ్ చానెల్స్, పత్రికలు గళం ఎత్తాలని.. ప్రజలను చైతన్యవంతం చేసేలా వైసీపీ అక్రమాలు బయటపడేలా రాయాలని.. చూపించాలంటూ రెండు చేతులు ఎత్తి మరీ పవన్ విజ్ఞప్తి చేశారు.మీడియా బలంగా ఉంటేనే సామాన్యుల గోడు తెలుస్తుందని..ఇది తన కోసం చేయమనడం లేదని.. కేవలం ఏపీ ప్రజల కోసం మీడియా అంతా ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చాడు.
‘మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం. వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం..’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తూ మీడియా సమావేశాన్ని ముగించారు.