TDP Janasena Alliance
TDP Janasena Alliance: ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేచిందా? టిడిపి, జనసేన కూటమిలో బిజెపి చేరనుందా? తెలంగాణ ఫలితాలు తర్వాత పరిస్థితులు మారనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఎల్లో మీడియాలో కథనాలు రావడంతో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. మూడు పార్టీల కలయిక చూసి వైసిపి వెన్నులో వణుకు పుడుతోందని టిడిపి అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టడం విశేషం.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులైన తర్వాత ఒక రకమైన పరిస్థితి ఏర్పడింది. ఆమె వైసీపీని టార్గెట్ చేయడం, తెలుగుదేశం పార్టీని సమర్థించడంతో ఎల్లో మీడియా ఆమెకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. గతంలో సోము వీర్రాజు వైసిపి పై ఇదే తరహా విమర్శలు చేసినా.. తెలుగుదేశం పార్టీ సైతం తనదైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఎల్లో మీడియాకు ఇది మింగుడు పడలేదు. అందుకే ప్రాధాన్యం దక్కలేదు. చివరకు సోము వీర్రాజు పాల్గొనే కార్యక్రమాల్లో.. ఆయన పేరుకనిపించని స్థితి వరకు ఎల్లో మీడియా వివక్ష కొనసాగింది.
అయితే తాజాగా ఆంధ్రజ్యోతిలో ఈ మూడు పార్టీలు ఒకటయ్యాయి అన్న రీతిలో ఒక కథనం వచ్చింది. దీంతో వైసిపి భయపడుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలుస్తాయి అన్న అనుమానం వచ్చే రీతిలో రాతలు ఉండడం విశేషం. అయితే అది టిడిపి పత్రిక కావడంతో.. సమాచారం ఉండి రాసి ఉంటారని.. బిజెపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 3 తర్వాతే ఏపీ పై బిజెపి ఫోకస్ పెట్టి అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇదే సమయంలో ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. జాతీయస్థాయిలో పలుకుబడి ఉన్న నాయకుడు సంతోష్ హాజరయ్యారు. ఏకంగా ఈ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ పై ఖండిస్తూ తీర్మానం పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి కథనం రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ విషయంలో ఏదో జరగబోతోంది అన్న అనుమానం పెరుగుతోంది. మరోవైపు ఏపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఏదో ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది. టిడిపి, జనసేనతో పొత్తు దిశగా బిజెపి వెళ్లే అవకాశం ఉందని.. అంతకుమించి వేరే ఆప్షన్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బిజెపి ఎలా స్పందిస్తుందో చూడాలి.