మనదేశంలో జనాభా 134 కోట్లు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పు 116 లక్షల కోట్లు. వయోజనులందరికీ ఈ అప్పును పంచితే.. సగటున లక్ష రూపాయలు ఉన్నట్టే లెక్క. ఇదంతా కేవలం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అప్పే. రాష్ట్రాలు తెచ్చిన అప్పుల లెక్క వేరే. అవి కూడా అటూ ఇటుగా ఓ లకారం వేసుకోవచ్చు. అంటే సగటు తెలుగువాడిపై ఉన్న దేశపు అప్పు 2 లక్షల రూపాయలు అన్నమాట! మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదంతా ఇప్పటి వరకు చేసిన అప్పులకు సంబంధించిన లెక్క మాత్రమే. మళ్లీ అప్పుచేస్తే.. ఆ మేరకు పెరుగుతూ పోతూనే ఉంటుంది.
దేశాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తునామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేసింది ఇలా అప్పుల కుప్పలు పెంచుకుంటూ పోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. రాష్ట్రాలు దుబారా చేస్తున్నాయని, అప్పులు తెచ్చి చిల్లచిల్లర ఖర్చు చేసేస్తున్నాయని చెబుతున్న కేంద్రం.. ఏదో సామెత చెప్పినట్టు గడిచిన ఆర్నెల్లలోనే 6.5 లక్షల కోట్ల అప్పులను తేవడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. అప్పటికే ఉన్న పన్నులకు తోడు జీఎస్టీ వంటి పన్నులు తోవడవడంతో ప్రజల నుంచి భారీగానే పన్నులు వసూలు అవుతున్నాయి. అయినప్పటికీ.. లక్షల కోట్ల అప్పులు తెస్తుండడం గమనార్హం.
ఈ విధంగా.. అప్పుల విషయంలో ఇటు రాష్ట్రాలకు, అటు కేంద్రానికి పెద్ద తేడా లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. కేవలం.. అధికారమే పరమావధిగా భావిస్తూ.. ఇష్టారీతిన పథకాలు ప్రవేశపెడుతూ.. అప్పు తెచ్చి పప్పుకూడు అన్నచందంగా వ్యవహరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోనీ.. తెచ్చిన అప్పుతో రీ ప్రొడక్షన్ అయ్యే పనులు ఏమైనా చేస్తున్నారా అంటే.. పెద్దగా కనిపించట్లేదు. తెచ్చిన డబ్బులు మొత్తం సంక్షేమ పథకాల పేరుతో ఖర్చయిపోయే పనులకే వాడుతున్నారని, తిరిగి ఆదాయం వచ్చే అవకాశం కనిపించట్లేదని అంటున్నారు విశ్లేషకులు.
మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం వచ్చేది లేదుగానీ.. అప్పులు మాత్రం ఏటికేడు పెరుగుతూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం అధికారం అనే యావతోనే కాకుండా.. దేశం బాగు కోసం కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, అప్పుడే.. బాగుపడుతుందని అంటున్నారు. మరి, దీనికి ప్రభుత్వాలు ఏమంటాయో?