హుజురాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈటల రాజీనామా స్పీకర్ ఆమోదించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. విజయం సాధించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గులాబీ బాస్ త్రిబుల్ షూటర్ హరీశ్ రావుకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. దీంతో బీజేపీ సైతం ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు ఇన్ చార్జీలను నియమించారు. ఈటలను ఎలాగైనా ఢీకొట్టాలనే ఉద్దేశంతో గులాబీ బాస్ పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మంత్రులు హుజురాబాద్ లోనే మకాం వేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం మొదలైంది. పార్టీలు తమ ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పెయింటింగ్స్ చేయించాయి. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు అభ్యర్థులను దింపేందుకు సమాయత్తం అవుతున్నాయి. విజయం కోసం అన్ని దారులు వెతుకుతున్నాయి. బలమైన దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నియోజకవర్గంపై ప్రేమను కురిపిస్తున్నాయి.
హుజురాబాద్ కు విచ్చేసిన ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం లభించింది. నాలుగైదు రోజులు అక్కడే ఉండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికార పార్టీని దెబ్బ తీయడానికి పావులు కదుపుతున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు పర్యటిస్తున్నారు.