
కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడటంతో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు అందించే పెన్షన్ లోనూ కోత విధించింది తెలంగాణ ప్రభుత్వం.పెన్షనర్లకు అందించే పెన్షన్లో 50శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై పెన్షనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలువురు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించడంతో… దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పెన్షన్ లో కోత విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. లాక్ డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య సమస్యలొస్తే ఎవరు ఆదుకుంటారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన పెన్షన్లలో కోత విధించారో చెప్పాలని న్యాయస్థానం సూచించింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించడం సరికాదని అభిప్రాయపడింది.
పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం దయాగుణంతో వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి పెన్షన్ ఇచ్చేలా సర్కార్ ను ఒప్పించాలని అడ్వకేట్ జనరల్ కు హైకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.