విదేశాల్లో చదువులు, మంచి ఉద్యోగం చేసే వారికి ఎర్ర తివాచీలు పరిచే రోజులు పోయాయి. ఒకప్పుడు మా వాళ్ళు అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో లేదా ఇతర దేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం గొప్పగా భావించే వాళ్ళు కానీ కరోనా రాకతో అన్ని ప్రగల్బాలు పక్కదారి పట్టాయి. కరోనా దెబ్బతో విదేశాల్లోని భారతీయ విద్యార్ధుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
అక్కడి విద్యాసంస్థలు నిరవధికంగా సెలవులు ఇస్తూ వుండడంతో విద్యార్ధులు ఇండియాబాట పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునే విద్యార్ధులు 72 గంటల్లోగా దేశం విడిచి వదిలి వెళ్లాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ చదువుతున్న మూడు వందల మంది భారతీయ విద్యార్థులు ఇండియాకి బయలుదేరి, మలేసియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయారు. తెలుగు రాష్ట్రాలకి చెందిన 60 మంది విద్యార్థులు వీరిలో ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎంబసీ అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని అక్కడి విమానాశ్రయ అధికారులు అడ్దుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార్లని సంప్రదిస్తే…తిరిగి ఫిలిప్పీన్స్ వెళ్లిపోమంటున్నారని విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విద్యార్థులు,వారి తల్లితండ్రులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.