
తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చేందుకు పాటుపడతానని పేర్కొన్నారు. వచ్చే నెల జులై 18న పార్టీ పేరు అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల పార్టీ పేరు ప్రకటించి కార్యాచరణ ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా ఈసీలో రిజిస్ర్టేషన్ చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు ఉండడంతో తెలంగాణలో ఒకటి మాత్రమే కలిసింది. ఒక పార్టీని పోలినట్లుగా ఉండడంతో మరో పార్టీ పేరు ఉండడంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, తన కుమార్తె తెలంగాణలో పెట్టే పార్టీకి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ ఈసీకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.
రిజిస్ర్టేషన్ లో ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఏప్రిల్ 30న కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో కోరగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. దీంతో ఈసీ నుంచి పార్టీ అనుమతుల ప్రక్రియ పూర్తి అయినట్లుగా షర్మిల వర్గం భావిస్తోంది. షర్మిల పెడుతున్న పార్టీకి ఎన్నికల సంఘం టేబుల్ ఫ్యాన్ గుర్తును కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి సంబంధించిన ప్రకటన వెలువడలేదు. ఇదెంత వరకు నిజమన్నది ఈసీ స్వయంగా ప్రకటిస్తేనే స్పష్టత వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇంకా ఏం జరుగుతుందో కార్యకర్తలు వేచి చూడాల్సిందే. ఈసీ ప్రకటన తరువాత రాష్ర్టంలో పార్టీ కార్యక్రమాలు చురుకుగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాయకులను సిద్ధం చేస్తున్నారు.