Chandrababu: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులను బలి పశువులు చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో వైసిపి నాయకులు సేఫ్ గా తప్పించుకున్నారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున గాయాల పాలయ్యారు. దీనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి కారణమన్న ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. వైసీపీ తరఫున ఎస్పీ వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుండడమే అందుకు కారణం.
రాయలసీమలో ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. అన్నిచోట్ల ఇవి సజావుగా సాగిపోతున్నాయి. చివరికి పులివెందులలో సైతం ప్రశాంతంగా ముగిసింది. వైసీపీ నేతలు రెచ్చగొట్టాలని, దాడులు చేయాలని భావించిన చోట మాత్రమే ఉద్రిక్తంగా మారుతోంది. పుంగనూరులో ఇదేవిధంగా మారింది. ఆ కుట్రలో పోలీసులు భాగస్వామ్యమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంగళ్లు నుంచి చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా లారీలు, బస్సులు, వజ్రవాహనాన్ని అడ్డంగా పెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. అయితే దీనిని ఎస్పీ రిశాంత్ రెడ్డి కూడా ధృవీకరిస్తున్నారు. అంటే వాహనాలను అడ్డం పెడితే గొడవలు జరుగుతాయని పోలీసులకు ముందే తెలుసన్నమాట. ఇప్పుడు ఎస్పీ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.
అంగళ్లు లో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో అతి చెరువలోకి వైసీపీ శ్రేణులు వచ్చి దాడులకు దిగాయి. అంటే ఒక విపక్ష నేత కార్యక్రమానికి విఘాతం కలిగేలా.. వైసీపీ కార్యకర్తలు రాగలిగారంటే అది ముమ్మాటికీ పోలీస్ వైఫల్యమే. ఈ దాడులను నియంత్రించలేని స్థితిలో పోలీసులు ఉండడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకొని మాత్రమే.. రాళ్లు వేస్తున్న వారిని తరమాలని టిడిపి శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే వైసీపీ శ్రేణులు తప్పించుకున్నాయి. పోలీసులు మాత్రం అడ్డంగా దొరికిపోయారు.
అయితే ఈ ఘటన తర్వాత ఎస్పీ మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉంది. ఇప్పటికే ఆయన వైసీపీ కోసం గుడ్డలు చించుకొని మరి పని చేస్తారన్న అపవాదు ఉంది. ఈ తరుణంలో ఆయన చేసిన ప్రకటన మరీ అభ్యంతరకరంగా ఉంది. అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాట్లాడిన అంశాలు చూస్తే.. పక్కా ప్లాన్ తోనే దాడులు జరిగాయని.. వైసీపీతో కలిసి పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ పై దాడులకు కుట్ర చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.