కరోనా మహమ్మారి దెబ్బకు బెజవాడ బెంబేలెత్తుతుంది.రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరగడంతో కృష్ణా జిల్లా విలవిలలాడుతోంది. మహమ్మారి కట్టడికి జిల్లాలో 25 మండలాలను రెడ్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు.ఈ రెడ్ జోన్ మండలాల్లో పటిష్టంగా లాక్ డౌన్ నిబంధనల్ని అమలు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు గుర్తించిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధితోపాటు అలాగే దానికి బఫర్ జోన్ ను కూడా కలుపుకొని మొత్తం 5 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతంలో 7 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా పరిగణిస్తారు.
కృష్ణ జిల్లాలో సోమవారం మరో ఐదు కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. కొత్తగా వచ్చిన ఐదు కేసులు విజయవాడ, రూరల్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సంబంధాలు ఉన్నవారు. గొల్లపూడి, ఆటోనగర్, ఖుద్దూస్ నగర్, కానూరు, అయోధ్యనగర్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ నిర్ధారణ అయింది. అధికారులు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. అలాగే గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే 37 మండలాల్లో లాక్ డౌన్ సడలింపులు వర్తిస్తాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు.
విజయవాడ పరిధిలోని ఐదు మండలాలతో పాటు మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, పెనమలూరు, కంకిపాడు, చందర్లపాడు మండలాలను కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు.
రాష్ట్రంలో సోమవారం కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖ పేర్కొంది. అలాగే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,336 కరోనా కేసులు నమోదు కాగా, 47 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,601కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతిచెందారని తెలిపింది.