Homeఆంధ్రప్రదేశ్‌ఎస్‌ఈసీతో గొడవ.. వైసీపీకే మైనస్‌ అవుతోందా..!

ఎస్‌ఈసీతో గొడవ.. వైసీపీకే మైనస్‌ అవుతోందా..!

Nimmagadda vs Jagan
ఏపీలో పంచాయతీ ఎన్నికలేమో కానీ ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వం గొడవ ఇంకా సద్దుమణగడం లేదు. ఓ వైపు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొలదీ ఇంకా వివాదం పెరుగుతూనే ఉంది. అయితే.. ఈ గొడవ అధికార పార్టీ వైసీపీకి తీవ్ర న‌ష్టం క‌లిగించింది. ఈ అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చెప్పుకొస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేవలం ప్రజాదరణ ఒక్కటే కాదు.. పలుకుబడిని సైతం కాపాడుకోవాలి. కేవలం ప్రజాదరణ ఉంటే సరిపోదనేది జగన్‌ తెలుసుకోలేకపోతున్నారు. జగన్‌కు పదేపదే అవే చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. క‌య్యానికైనా, వియ్యానికైనా స‌మ ఉజ్జి ఉండాల‌ని పెద్దలు చెబుతుంటారు. కానీ.. జ‌గ‌న్ ప్రభుత్వం స‌ప‌రేట్‌. న‌చ్చితే నెత్తిన పెట్టుకోవ‌డం, న‌చ్చకపోతే నరకం చూపడమే నడుస్తోంది.

Also Read: మంత్రి పెద్దిరెడ్డితో నిమ్మగడ్డ వార్.. 30మంది అధికారులు బదిలీ..

ఒక వైపు ఏక‌గ్రీవాల కోసం స‌ర్వశ‌క్తులు ఒడ్డుతున్నా.. ఆశించిన ఫ‌లితాలు రాలేద‌న్నది ప‌చ్చి నిజం. ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్యవ‌హార శైలిని ఎన్నిక‌ల వాయిదాకు ముందు, ఆ త‌ర్వాత అని విభ‌జించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. అప్పుడు నిమ్మగ‌డ్డ ర‌మేశ్‌కుమార్ అంటే ఎవ‌రో కూడా తెలియ‌దు. ఇప్పుడు నిత్య నామ‌స్మరణే అయిపోయింది. ఇందుకు జగన్‌ ప్రభుత్వం కారణమనేది అందరికీ తెలిసిందే.

కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్‌.. ఒక్కసారిగా జగన్‌కు షాక్‌ ఇచ్చింది. నిమ్మగడ్డ నిర్ణయంపై సీఎం జ‌గ‌నే నేరుగా త‌న నిర‌స‌న ప్రక‌టించారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చంద్రబాబుకు రాజ‌కీయ ల‌బ్ధి క‌లిగించేందుకే నిమ్మగ‌డ్డ క‌నీసం ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఈసీతో మున్ముందు క‌లిసి ప‌నిచేయాల‌నే ఆలోచ‌న ఉన్న వాళ్లెవ‌రూ ఇలా వ్యవ‌హ‌రించరనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.

అప్పుడు మొదలైన వార్‌‌ రోజురోజుకూ తీవ్రం అవుతుందే తప్ప తగ్గింది లేదు. ఇపుడు అధికార పార్టీకి నిమ్మగడ్డనే ప్రధాన ప్రతిపక్షం అయిపోయారు. అయితే నిమ్మగ‌డ్డ మాత్రం త‌క్కువేం చేయ‌లేద‌న్న అభిప్రాయాలున్నాయి. జ‌గ‌న్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కేంద్ర హోంశాఖ‌కు ఘాటైన లేఖ రాశారు. ఇది ప్రభుత్వానికి మ‌రింత కోపం తెప్పించింది. ఆ త‌ర్వాత నిమ్మగ‌డ్డపై ప్రభుత్వం తీసుకున్న చ‌ర్యలు, న్యాయ‌స్థానాల్లో ప్రతికూల తీర్పులు.

Also Read: విశేషాధికారాల నిమ్మగడ్డ.. ఏం చేయబోతున్నారు..?

తొలి ద‌శ‌లో 3,249 గ్రామ పంచాయ‌తీలు, 32,504 వార్డు స్థానాల‌కు ఎన్నిక‌లు ఈ నెల 9న జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పటి వ‌ర‌కూ 100 స్థానాల‌కు మించి ఏక‌గ్రీవాలు అయిన‌ట్టు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. నామినేష‌న్లు వేసే ధైర్యం అభ్యర్థుల‌కు ఎక్కడి నుంచి వ‌చ్చింది? అనే ప్రశ్నకు ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ ర‌మేష్‌ కుమార్ తీసుకుంటున్న చ‌ర్యలేనని అధికార పార్టీ కూడా అంగీక‌రిస్తోంది. 11 నెల‌ల క్రితం నామినేష‌న్ వేయ‌డానికి వెళితే అడ్డుకున్న పోలీసులు, ఇప్పుడు అదే ఉద్యోగులు ద‌గ్గరుండి నామినేష‌న్ వేయించే ప‌రిస్థితి వచ్చింది. ఎస్ఈసీతో ఏ పేచీ లేకుండా ఉండి ఉంటే.. అనామ‌కుడిలా నిమ్మగ‌డ్డ వ‌చ్చే నెల‌లో రిటైర్‌‌ అయ్యేవారు. ఇపుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నచందంగా తయారైంది వైసీపీ పరిస్థితి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular