Jagan says sweetheart to village and ward volunteers
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డ్ వాలంటీర్లకు అదిరిపోయే తీపికబురు చెప్పారు. గతేడాది ఆగష్టు 15 నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డ్ వాలంటీర్లకు వారి సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 2.52 లక్షల మంది గ్రామ, వార్డ్ వాలంటీర్లకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించింది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ సర్కార్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనే ఉద్దేశంతో తెచ్చిన ఈ వ్యవస్థ వల్ల ప్రజలు గతంలోలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది.
జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల్లోని హామీలతో పాటు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ను కేటాయించి ఆ వాలంటీర్ కు ఆ ఇళ్లల్లో నివహించే అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ వ్యవస్థ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెడుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఆగష్టు 14వ తేదీతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల పదవీకాలం ముగియగా మరో ఏడాది పాటు ప్రభుత్వం వాలంటీర్ల పదవీకాలాన్ని పొడిగించడంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల కోసం 1,560 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది.