క్వారంటైన్లు, ఐసోలేషన్ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కరోనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని సూచించారు.
ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి సన్నిహితులవని అధికారులు సీఎంకు వివరించారు. ఢిల్లీ వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
మరిన్నీ పరీక్షలు నిర్వహించేలా పరీక్షా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుకుంటామని అధికారులు తెలిపారు. రెడ్జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టం చేశారు.
1092కు వచ్చే కాల్స్ పరిష్కారంపై దృషిపెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.