ముఖ్యమంత్రి పాలనపై అధికార పార్టీ ఎలాంటి సర్టిఫికెట్లు ఇచ్చుకున్నా.. ప్రతిపక్షాలు ఇంకెలాంటి రిపోర్టులు ఇచ్చినా.. ప్రజలు ఇచ్చే జడ్జ్ మెంట్ వేరే ఉంటది. పరిపాలనపై అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. వారిని బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయనీగాక.. వాస్తవాలను మాత్రం వారి కంటికి కనపడకుండా చేయలేరు. ఇక, విషయానికి వస్తే.. ఏపీ సీఎం జగన్ పాలనపై పోస్టు మార్టం ఒక్కొక్కరు ఒక్కో రీతిన చేస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకూ రెండేళ్లయ్యింది. ఈ రెండేళ్లలో పలు సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రజలు అడిగిందీ.. అడగనిదీ.. అన్నీ ప్రకటిస్తూపోతున్నారు. దీనివల్ల ఖజానాపై తీవ్ర భారం పడుతోంది. ఏడాదిలో దాదాపు 70 వేల కోట్లు ఈ పథకాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ విషయం పక్కన పెడితే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ క్యాంప్ ఆఫీసుకు మాత్రమే పరిమితం అవుతున్నారనేది ప్రధాన అభియోగం.
ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి బయటకు రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఆయన దృష్టికి రావట్లేదని అంటున్నారు. ఈ రెండేళ్లలో వేళ్లమీద లెక్కబెట్టగలిగినన్ని సార్లు మాత్రమే ఆయన క్యాంప్ కార్యాలయాన్ని వదిలి బయటకు వచ్చారు. కరోనా పరిస్థితుల్లో ఒక్కసారి కూడా జగన్ బయటకు వచ్చిన దాఖలాల్లేవు.
ప్రజలకు ధైర్యం చెప్పడం.. అధికారులకు సూచనలు చేయడం వంటివి ఏవీ జరగలేదు. దీంతో.. ప్రజలకు సరైన సేవలు అందట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసుపత్రుల్లో రోగులకు పడకలు లభించట్లేదు. కొవిడ్ కేర్ సెంటర్ల గురించి పట్టించుకున్నది లేదు. చాలా చోట్లలో అంబులెన్సులలోనే చికిత్సలు అందిస్తున్న పరిస్థితి ఉంది.
కేవలం సంక్షేమ పథకాలతో బండి నెట్టుకురావాలంటే కుదరదని, అభివృద్ధి.. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన కూడా ముఖ్యమని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో జగన్ విఫలమవుతున్నారని చెబుతున్నారు. క్యాంప్ ఆఫీసును వదిలి బయటకు వస్తే తప్ప.. ప్రజల సమస్యలు జగన్ కు అర్థమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మరి, జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.