Safeimagekit-resized-img(476)
TDP Vs YCP: ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష నాయకుల సభలకు అధికార పక్షం అడ్డుపడుతోంది. అదే సమయంలో విపక్షం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి చిత్తూరు జిల్లాలో జరిగిందదే. అటు వైసిపి అయినా ఇటు టిడిపి అయినా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సమయానికి ప్రజలను తమ వైపు తిప్పుకునే వ్యూహాలను అమలు చేయడం తప్పుకాదు. కానీ ఇప్పటినుంచి రెచ్చగొట్టేలా చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆందోళనకరమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తామన్న ధీమా నుంచే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమకి ఇంకా ఎదురులేదని భావిస్తున్న రాజకీయ పక్షాలు..పార్టీ శ్రేణులకు అదే నూరిపోస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల క్యాడర్ సైతం రెచ్చిపోతుంది. తగ్గేదేలే అంటూ వీధి పోరాటాలకు సైతం దిగుతున్నారు. నాలుగేళ్లుగా టిడిపి శ్రేణుల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. ఇప్పుడిప్పుడే గెలుస్తామన్న ధీమా టిడిపిలో వ్యక్తం అవుతోంది. ఫలితంగా అది అంతులేని ధైర్యం ఇస్తుంది. దాని ఫలితంగా అధికార పార్టీకి ఢీకొట్టే మాదిరిగా తెలుగుదేశం చర్యలు ఉంటున్నాయి. స్వతహాగా దూకుడుగా ఉండే వైసీపీకి ఇది మింగుడు పడటం లేదు. దాని ఫలితమే ఈ విధ్వంసం.
వచ్చే ఎన్నికలు అంత ఆషామాషీగా జరగవని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గత ఎన్నికల ముందు అధికారపక్షంగా టిడిపి.. ప్రతిపక్షంగా వైసిపి ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికారపక్షంగా వైసిపి.. విపక్షాలుగా టిడిపి, జనసేన లు ఉన్నాయి. పొత్తు ఉంటే రెండే పక్షాలు. పొత్తు లేకుంటే మాత్రం మూడు పక్షాలు బరిలో దిగుతాయి. ఎలా ఉన్నా ఫైట్ మాత్రం హోరాహోరీ. మూడు పార్టీలకు అభిమానించే క్యాడర్ ఉంది. ప్రజలు కూడా వర్గాలుగా విడిపోక తప్పదు. ఈ క్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించే పరిస్థితుల్లో ఒక విధమైన క్లిష్ట వాతావరణం ఎదురుకానుంది.
మున్ముందు ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా ప్రధాన రాజకీయ పక్షాల నుంచే. సోషల్ మీడియా విస్తృతం కావడం.. ఎన్నికల వాతావరణం రావడం.. రాజకీయపక్షాల్లో సంయమనం లోపించడం.. వంటి కారణాలతో.. ఎన్నికలు జరిగే నాటికి ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అటు రాజకీయ పార్టీ నేతలు బాధ్యతగా మెలగడంతో పాటు.. పార్టీల సానుభూతిపరులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటికి దూరంగా ఉంటేనే మంచిది. వారి చర్యలు ఫలితంగా రాష్ట్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.