‘‘టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. బహుజన వాదం పేరుతో మల్లన్న చేస్తున్నది మొత్తం డబ్బుల దందా. పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నుంచి కూడా డబ్బులు తెచ్చుకున్నాడు.’’ అంటూ.. క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై.. అదే ఛానల్ లో బ్యూరోగా పనిచేస్తున్న చిలకా ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మల్లన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బహుజన వాదం పేరుతో తీన్మార్ మల్లన్న చేస్తున్నదంతా మోసమని ప్రవీణ్ ఆరోపించారు. బహుజన వాదం పేరుతో ఏడాది క్రితం తనను సంప్రదిస్తే.. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఆయనతో కలిసినట్టు చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కరోనా సమయంలోనూ మల్లన్న చేసిన 1650 కిలోమీటర్ల పాదయాత్రను తానే కో-ఆర్డినేట్ చేసినట్టు చెప్పారు.
మల్లన్న నిర్వహించే ఛానల్ లో పొద్దున ఒక దందా.. సాయంత్రం మరో దందా జరుగుతుందని ఆరోపించారు. ఓ మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి వస్తే.. ఆమెను అవమానించాడని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న ఏ నాయకుడి వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నాడో మొత్తం తన వద్ద చిట్టా ఉందని అన్నారు.
పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రితోనూ డీల్ కుదుర్చుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ను రోజూ తిడతాడని ఆయనతో శత్రుత్వం ఉందని చాలా మంది అనుకుంటారని, కానీ.. అక్కడి నుంచి కూడా డబ్బులు తెచ్చుకున్నాడని ప్రవీణ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఒకరి వద్దకు వెళ్లి రూ.20 కోట్లు తెచ్చుకున్నాని అన్నారు.
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను కూడా డబ్బులు డిమాండ్ చేశాడని, అయితే.. మల్లన్న సంగతి తెలిసిన ఆమె.. డబ్బులు ఇవ్వలేదని అన్నారు. ఇక, ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చింది కూడా మల్లన్నే అని ఆరోపించారు చిలుకా ప్రవీణ్. బీజేపీలో చేరకపోతే అరెస్టు చేయిస్తారని ఈటలను భయపెట్టారని, ఇప్పుడు రాజేందర్ గెలుపు కోసం భారీగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. తాను మాత్రం ఏ పార్టీకి చెందిన వాడిని కాదని చెప్పుకొచ్చారు. తాను ఎదురు తిరిగినందుకు 5 లక్షలు మోసం చేసినట్టు తనపై నిందలు వేసేందుకు యత్నించారని, దీన్ని నిరూపిస్తే.. ఉరేసుకొని చనిపోతానని అన్నారు.