Meat Digestion : వారాంతం లేదా ప్రత్యేక రోజుల్లో మాంసాహారం తినడం చాలామందికి అలవాటు. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది. అయితే శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మాంసాహారంలో ఎక్కువ నూనె ఉండడంతో దీనిని తిన్న వెంటనే కడుపు బరువుగా అనిపిస్తుంది. అయితే మాంసాహారం తిన్న తర్వాత కొన్ని అలవాట్లు పాటిస్తే జీర్ణక్రియ సులభంగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
మాంసాహారం తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని నీరు తాగాలి. మజ్జిగ లో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను సులభతరం చేయడంలో తోడ్పడుతుంది. అయితే చల్లటి పానీయాలు లేదా ఐస్ వాటర్ను వెంటనే తాగడం కంటే గోరువెచ్చని నీటినే ఎంచుకోవడం మంచిది.
భోజనం చేసిన వెంటనే సోఫాలో కూర్చోవడం లేదా మంచం పై పడుకోవడం మంచిది కాదు. బదులుగా 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా కఠినమైన వ్యాయామం చేయకూడదు.
మాంసాహారం తిన్న తర్వాత కొద్దిగా సోంపు నమలడం కూడా మంచి అలవాటు. సోంపులో ఉండే సహజ పదార్థాలు జీర్ణ రసాల విడుదలకు తోడ్పడతాయి. అలాగే నోటి దుర్వాసనను తగ్గించడంలో, కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఉండటంలో కూడా ఇది కొంతవరకు సహాయపడుతుంది.
మాంసాహారం తగినంతగా ఉడికించడం చాలా ముఖ్యం. సరిగా ఉడకని మాంసం లో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి మాంసాన్ని పూర్తిగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రుచిగా ఉందని ఒకేసారి ఎక్కువ మాంసాహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. పరిమిత మోతాదులో తీసుకుని, దానికి తోడు కూరగాయలు, సలాడ్ లేదా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీర్ణక్రియ మరింత మెరుగ్గా జరుగుతుంది.