Homeజాతీయ వార్తలురేవంత్ రెడ్డి కాంగ్రెస్ నావ నడిపించేనా?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నావ నడిపించేనా?

Revanth Reddyకాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయమే తీసుకుంది. ఇన్నాళ్లు సీనియర్లకు భయపడి ఏ రకమైన నియామకం చేయని అధిష్టానం ఒక అడుగు ముందుకేసి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియామకం చేసింది. దీంతో సీనియర్లలో ఆగ్రహం రేగడం మామూలే. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆక్షేపణలు వచ్చాయి. అయినా మంచి నిర్ణయమే తీసుకుందని భావిస్తున్నారు. ప్రపంచం ముందుకు పోతున్నా పార్టీ సిద్ధాంతాలు మాత్రం అక్కడే ఉంటున్నాయి. దీంతో ఇన్నాళ్లు పెద్దగా ఫలితాలు రాలేదు. ఎవరో స్వార్థానికి పార్టీని బలిపెట్టిన ఫలితంగా పార్టీ ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే నాయకుడిగా రేవంత్ రెడ్డి నిలుస్తాడనే నమ్మకం కార్యకర్తల్లో కలుగుతోంది.

రేవంత్ రెడ్డి నాయకత్వంపై నేతలకు విశ్వాసం ఉంది. తెలంగాణలో పక్కా మాస్ నాయకుడంటే రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ను ఢీకొనే లీడరంటే ఆయనే అనే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రతిభకు అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో సీనియర్లందరు అలక వహించారు. వారిని బుజ్జగించి పార్టీకి దిశానిర్దేశం చేసే పనిలో భాగంగా అందరిని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు నడిపించారో అంతే సత్తా గల నేత రేవంత్ రెడ్డి అనే విషయం అందరికి తెలిసిందే.

రేవంత్ రెడ్డిది పదిహేనేళ్ల రాజకీయం. ఆయన రాజకీయం మొదలైంది టీఆర్ఎస్ తోనే. టీఆర్ఎస్ లో ఒక సాధారణ కార్పొరేటర్ గా ఆయన 2000లో గెలిచారు. తరువాత టీడీపీలో చేరారు. దీనికి చంద్రబాబు బాగా లిఫ్ట్ ఇవ్వడంతో తన ప్రభావాన్ని పెంచుకున్నారు. అనతికాలంలోనే తన టాలెంట్ నిరూపించుకుని మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం చాలా కష్టమే. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తులో ఇద్దరు సమ ఉజ్జీవులుగా నిలుస్తుండడంతో నాయకుల అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. అయితే చంద్రబాబు నీడ పడకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో సీనియర్లను కలుపుకునిపోతే విజయం నల్లేరు మీద నడకలా ఉంటుంది. అదే వారిని పట్టించుకోకపోతే కష్టమే. దీంతో రేవంత్ రెడ్డిపై పార్టీని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉందో లేదో అనే అనుమానాలు అక్కరలేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి కాదు రవ్వంత్ రెడ్డి అని విమర్శలు చేస్తున్నవారిని సైతం దగ్గరకు తీసుకుని కలుపుకుని పోవాల్సిన అవసరం ఏర్పడింది.

మొత్తానికి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద గురుతర బాధ్యతలు మీద పడ్డాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఇన్నాళ్లు పోయిన పరువును నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎవరిలో కూడా పాజిటివ్ దృక్పథం కనిపించడం లేదు. నాయకుల్లో నైరాశ్యం పోగొట్టి గెలుపు మంత్రం ఉపదేశించాల్సిన సమయం వచ్చింది. దీనికి అందరిలో ఆశావహ దృక్పథం కల్పించే క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular