
టీడీపీ సోషల్ మీడియాకు బీజేపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో బీజేపీపై అసత్యఆరోపణలు చేస్తూ, బురదజల్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తోందని హెచ్చరించింది. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రారెడ్డి సూర్యారావుపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
షేక్ బాజి మాట్లాడుతూ నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అనుచరుడిగా ఉన్న బబ్బూరి వెంకట్రావ్ అనే టీడీపీ నాయకులు ప్రధానిమోదీని, రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ఇతర నాయకులపై అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వీరు చేసిన అక్రమలు, అవినీతిపై రాష్ట్రప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెడితే దానినుంచి బయటపడలేకపోతున్న మీరా బీజేపీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. సోమువీర్రాజు, విష్ణువర్ధనరెడ్డి, ఇతర నాయకుల జోలికి వస్తే వారిపై కార్యకర్తలు చేసే భౌతిక దాడులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని హెచ్చరించారు. ప్రపంచం మొత్తం మోదీని విశ్వసించి ఆదరిస్తుందన్నారు. బీజేపీ నిజాయితీగా అభివృద్ధికోసం పనిచేస్తుందని, ప్రజలు అభివృద్ధి వైపు చేస్తారన్నారు. 1997లో ఎలాగైతే వాజ్ పేయి నాయకత్వంపై నమ్మకం ఉంచి విజయాలు అదించారో.. అలాగే 2024 ఎన్నికల్లో ఏపీలో పార్టీని గెలిపిస్తారని చెప్పారు.
* అయోమయంగా మహానాడు
తెదేపా మహానాడు సోత్కర్షలు, చంద్రబాబు భజనల నాడుగా సాగిందని బీజేపీ నేతలు విమర్శించారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో జరిగిన చర్చలు ప్రజలకు ఏమాత్రం అర్ధంకాకుండా ఉన్నాయన్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు ద్రోహం చేసి ఇప్పుడు తెదేపా మహానాడు కార్యక్రమంలో ఆయను పొగడటానికి నోరెలా వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వల్లే నరేంద్రమోదీ ప్రధాని అయ్యారనే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ప్రజలు నవ్వుకుంటున్నారని షేక్ బాజి అన్నారు. 2014లో బీజేపీ, జనసేనల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, అధికారమదంలో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించి 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడినా చంద్రబాబుకు గుణపాఠం రాలేదన్నారు.
*సేవా హి సంఘటన్”
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడేళ్లు విజయవంతంగా పాలన పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం నుంచి వారం పాటు రాష్ట్రంలో సేవా పస్తాహ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు.. ముందుగా విజయవాడలో ప్రైవేటు టీచర్లకు నిత్యావసర వస్తువుల పంపిణి, రక్తదాన శిబిరాలు, అనాధాశ్రమాల్లో పళ్లు పంపిణీ కార్యక్రమం చేస్తామన్నారు.
భౌతికదాడులు జరిగితే మాది బాధ్యత కాదని బీజేపీ నేతలు తెలిపారు. టీడీపీకి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి భాజపా ఐటీ సెల్ పేరుతో ఒక సోషల్ మీడియాలో పేజీ సృష్టించి భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజుతో పాటు భాజపాకు చెందిన 17 మంది నాయకులు వైకాపా తీర్ధం పుచ్చుకుంటున్నట్లు, రఘురామకృష్ణంరాజుకు పార్టీ పగ్గాలు ఇస్తున్నట్లు కేంద్రం నిర్ణయించినట్లుగా చేసే అసత్యప్రచారాన్ని ఖండిస్తున్నట్లు యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.
మరో టీడీపీ నాయకుడు బబ్బూరి వెంకట్రావు తన యూట్యూబ్ ఛానల్లో భారతదేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానిమోదీని, భారతజాతిని అవమానించడంపై తీవ్రంగా మండిపడ్డారు. భావస్వేచ్ఛ ప్రకటన ఇతరుల మనోభావాలను కించపరిచేలా ఉండరాదని పేర్కొన్నారు. వీరిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి సూర్యతేజ పాల్గొన్నారు.