
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నాయకుడు.. ఈ డైలాగ్ పవన్ కల్యాణ్కు సరిగా యాప్ట్ అవుతుంది. అందుకేనేమో బీజేపీ కోరినట్లుగా అన్ని సీట్లను త్యాగం చేస్తున్నారు. కానీ.. అదే టైమ్లో ఫ్యూచర్ రాజకీయాల ఆలోచనలో ఉన్నారు పవన్. ఇప్పటివరకు ఆయా స్థానాలకు బై ఎలక్షన్లు వచ్చినప్పటికీ.. వాటిని బీజేపీ కోసం జనసేన వదులుకుంది. అయితే.. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ–జనసేన పార్టీల తరఫున ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్ ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటల్లో చెప్పాలంటే.. సందర్భాన్ని బట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ మారుతూ ఉంటుంది.
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్తో బీజేపీకి చాలా వరకూ అవసరం ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో ఆయనతో ప్రచారం చేయించుకోవాల్సి ఉంది. ఈ కారణంగా పవన్ కల్యాణే సీఎం అని సోము వీర్రాజు చెబుతున్నారు. జనసేన–-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోము మాటలు విని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఏమనుకున్నారో కానీ.. ఖచ్చితంగా ఆయనకు కొంత కాలం కిందట ఇదే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చి ఉంటాయి.
బీజేపీ–-జనసేన గెలిస్తే బీసీకే ముఖ్యమంత్రి పదవి అని కొద్ది రోజుల కిందట సోము వీర్రాజు ప్రకటించారు. అప్పుడే అసలు వివాదం నెలకొంది. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసు నుంచి తప్పించారని.. ఆయనను కించ పరిచారని జనసేన ఫైర్ అయింది. హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లడంతో వారు కూడా హెచ్చరికలు పంపించారేమో కానీ సోము వీర్రాజు వెంటనే సర్దుకున్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేంత పెద్దవాడిని కాదని మాటలు వెనక్కి తీసుకున్నారు. మీడియా వక్రీకరించిందన్నారు. దాంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది.
కానీ.. జనసేనలోమాత్రం అనుమానపు బీజాలు పడిపోయాయి. అప్పటి నుంచే దూరం పెరిగింది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికల సమయంలో అది ప్రభావం చూపించకుండా సోము వీర్రాజు.. జనసేనకు ముఖ్యమంత్రి పదవి అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి సోము వీర్రాజుకు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలుఉన్నాయి. బీజేపీ ఏపీ సోషల్ మీడియా టీం.. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికి అనేక పేజీలు నడుపుతున్నారు. కొన్ని పేజీల్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనలో సహజంగానే అనుమానపు మేఘాలు కమ్ముకుంటాయి. ఇంతకాలం వాటిని క్లియర్ చేయజానికి పెద్దగా ఎవరూ ప్రయత్నించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా రారా అన్న మీమాంస ఏర్పడింది. దీంతో ఇలాంటి ప్రచారానికి తెరలేపారని తెలుస్తోంది.