AP BJP: ఏపీలో బిజెపి అభ్యర్థులు కొలిక్కి రావడం లేదు. రోజులు తరుగుతున్నా అటు అసెంబ్లీకి కానీ.. ఇటు పార్లమెంట్ స్థానాలకు కానీ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోతోంది. బిజెపితో పోల్చుకుంటే మిగతా రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. బిజెపి మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉంది. ఏకంగా అభ్యర్థుల జాబితాతో పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం లేదు. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది.ప్రచార పర్వంలోకి దూకుతోంది. జనసేన సైతం చాలా వరకు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తేలాల్సింది బిజెపి వైపు నుంచే. కానీ ఎందుకో బీజేపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. పురందేశ్వరి సైతం అభ్యర్థుల జాబితా కసరత్తులో ఉన్నారు. బిజెపి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో పొత్తు వర్కౌట్ అవుతుందా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నిజానికి ఈ పొత్తు బిజెపిలోని కొందరు వైసీపీ అనుకూల నేతలకు నచ్చడం లేదు. కానీ పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు టిడిపితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి నాయకులతోనే సమస్య ఏర్పడింది. వీరు రకరకాలుగా సెటైరికల్ గా మాట్లాడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీతో ఒక రకమైన గ్యాప్ నకు కారణమవుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బిజెపి వైఖరి నచ్చడం లేదు. అటు తెలుగుదేశం వైఖరి బిజెపి నేతలకు నచ్చటం లేదు. కానీ అవసరాల మేరకు వారు కలిశారు. టిడిపి ఆశిస్తున్నట్లు బిజెపి ప్రచార పర్వంలోకి రావడం లేదు. ఈ వ్యవహారం మొత్తం కూటమికే ఇబ్బందికరంగా మారనుంది. కూటమిలో బిజెపి పెద్దన్న పాత్ర పోషించాలని టిడిపి కోరుకుంటుంది. వైసీపీపై తీవ్రస్థాయిలో ఆ బిజెపి నేతలు విమర్శలు చేయాలని ఆశిస్తోంది. కానీ బిజెపి నుంచి ఆ తరహా స్పందన మాత్రం కనిపించడం లేదు.
కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు. చంద్రబాబు తో పాటు పవన్ లతో వేదిక పంచుకున్నారు. అధికార వైసిపి పై ఒకటి రెండు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు నీరుగారిపోయాయి. బిజెపి శ్రేణులు మాత్రం కొంత అయోమయానికి గురయ్యాయి. బిజెపిలోని ప్రో వైసిపి నేతలు మాత్రం ప్రధాని ప్రసంగాన్ని.. వేరే విధంగా ప్రచారం చేయడం ప్రారంభించాయి. టిడిపి, జనసేన లకు అనుమానం కలిగించేలా కొందరి బిజెపి నేతల వ్యవహార శైలి ఉంది. మరోవైపు చూస్తే పురందేశ్వరి అభ్యర్థుల ఎంపికలో తల మునకలై ఉన్నారు. దీంతో వైసిపి పై బిజెపి నేతల విమర్శల దాడి తగ్గింది. దీంతో పొత్తులో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బిజెపి వెనక్కి తగ్గిందన్న సంకేతాలను కొందరు కాషాయ దళం నేతలు లీకులు అందిస్తున్నారు. ఒకవైపు పొత్తు కుదుర్చుకునే.. పొత్తుకు విఘాతం కలిగించేలా బిజెపి నేతల వ్యవహరించడం మిగతా రెండు పార్టీలను కలవరపరుస్తోంది. అయితే ఈ తరహా ప్రయత్నాలను అడ్డుకోకపోతే పొత్తు లక్ష్యానికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిజెపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.