Homeజాతీయ వార్తలుKCR vs Congress : "కేసీఆర్ పై దాడి" కాంగ్రెస్ కు నష్టమేనా?

KCR vs Congress : “కేసీఆర్ పై దాడి” కాంగ్రెస్ కు నష్టమేనా?

KCR vs Congress : ఒక కుక్కను చంపాలంటే ముందు దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి. అలా పిచ్చిదని ముద్ర వేయకుండా చంపేస్తే జనం దృష్టిలో చంపిన వాళ్ళు నేరస్తులు అవుతారు. చనిపోయిన కుక్క హీరో అవుతుంది. సో అలాంటప్పుడు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ఈ ఉపోద్ఘాతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఎన్నికల సమయంలో ఒక పార్టీ మరో పార్టీపై చేసుకునే విమర్శలను జనం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఎన్నికలంటేనే అలాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. కానీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అలాంటి విమర్శలు చేసుకుంటామంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు ఓడిన వాడి పట్ల సానుభూతి పెరుగుతుంది. గెలిచిన వాడి పట్ల హేవమైన భావం ఏర్పడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే కంటే ముందే మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్ళు ఏర్పడ్డాయి. రెండు పిల్లర్లు కుంగిపోయి దానిపై రాకపోకలు నిలిపివేశారు. ఇది సహజంగానే అప్పటి అధికార భారత రాష్ట్ర సమితికి ప్రతిబంధకంగా మారింది. ఎన్నికల సభలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పే భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ తర్వాత ఆ ప్రస్తావన మర్చిపోయారు. దీనిని సహజంగానే కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. మీడియా పట్టించుకోకపోయినప్పటికీ పదేపదే ఈ విషయాన్ని ప్రతి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో ప్రజల్లో ఆలోచన మొదలై భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మెజారిటీ ఇవ్వలేదు. 64 సీట్లతో బోటా బోటి మెజారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత రాష్ట్ర సమితి కుదురుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. పైగా హామీలు అమలు చేయాలనే పేరుతో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. సహజంగానే కాంగ్రెస్ పార్టీకి చిరాకు తెప్పిస్తోంది. ఇటీవల కృష్ణ ప్రాజెక్టుల వివాదానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి నల్లగొండలో నిర్వహించిన సభ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారింది. అత్యంత తెలివిగా రేవంత్ రెడ్డి అదేరోజు మేడిగడ్డ సందర్శన యాత్ర చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వేరువేరు వేదికల మీదుగా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. కెసిఆర్ ను లక్ష్యంగా కాకుండా ఆయన చేపట్టిన విధానాల మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. విధానాల లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వాటి పరిష్కార బాధ్యతను ఎలా చేపడతామో కాంగ్రెస్ పార్టీ చెబితే ఉపయుక్తంగా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పార్లమెంటు ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు మరింత ముదిరే క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అసలే కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పరిస్థితులు బాగోలేవు. తెలంగాణలోనూ గొప్ప మెజారిటీ లేదు.. అలాంటప్పుడు కేసీఆర్ విధానాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించాలి. కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలు అనుభవించింది. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తే మొదటికే మోసం వస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular