Harish Rao : మొన్న భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు గుర్తుందా.. అందులో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి ప్రధాన కారణం సిఎం సన్నిహితుడు ఖురేషి అని ఆరోపించారు కదా.. పైగా ఎక్కడో వాసవి బిల్డర్స్ విజయ్ కుమార్ తో కలిసి కొంతమంది కావాలని పెద్ది మీద ఆరోపణలు చేయించారని.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుకు గురయ్యారని.. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు కదా..
ప్రవీణ్ కుమార్ ఆ మాటలు మాట్లాడిన తర్వాత చాలామంది సుదర్శన్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని.. అధికార పార్టీ వేదింపులు తట్టుకోలేకనే ఆయనకు ఈ స్థాయిలో గుండెపోటు వచ్చిందని అనుకున్నారు. కానీ చివరికి ప్రవీణ్ కుమార్ మాటలంతా అబద్ధమని.. అసలు వాస్తవం ఇదని హరీష్ కుమార్ చెప్పారు.
అత్యాధునిక చికిత్స అందిస్తున్నప్పటికీ సుదర్శన్ రెడ్డి చనిపోయారు.. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్టు యశోద ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. దాని కంటే ముందుగానే హరీష్ రావు పెద్ది మరణం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టారు. “పెద్ది సుదర్శన్ రెడ్డి హిమోగ్లోబిన్ కు సంబంధించిన మందులు వాడుతున్నారు. గత నెల రోజులుగా ఆ మందులు ఆయన వాడటం లేదు. దీనివల్ల ఊపిరితిత్తులలో సమస్య ఎదురయింది. అది కాస్త తీవ్రమైన సమస్యకు దారి తీసింది. ఆ తర్వాత ఉదయం నుంచి మెదడుకు రక్త సరఫరా ఆగిపోయింది. మెదడుకు రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా ఆగిపోవడంతో అందులో ఉన్న కణజాలం దెబ్బతిన్నది. హృదయం కూడా కొద్ది క్షణాలపాటు పనిచేయకుండా ఆగిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. హన్మకొండ రోహిణి ఆసుపత్రిలో సిపిఆర్ చేశారు. అనేక రకాల చికిత్సలు చేశారు. అక్కడ ఆ స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో.. వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అత్యాధునిక పరికరాలతో ఆయనకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఇక్కడ మాత్రమే కాదు.. అమెరికా.. ఇంగ్లాండ్.. లండన్ ప్రాంతాలలో ఉన్న వైద్యులతో కూడా మాట్లాడారు. వారు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశారు. కానీ పెద్ది ప్రాణాలు కాపాడలేకపోయారని” హరీష్ రావు పేర్కొన్నారు.
హరీష్ రావు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలకు విలువ లేకుండా పోయింది. చివరికి మాజీ ఎమ్మెల్యే మరణం విషయంలో కూడా రాజకీయం చేయాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు ఇప్పుడు సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నాయకుడు.. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వీగిపోయాయి. వాస్తవానికి సుదర్శన్ రెడ్డి అనారోగ్యం గురించి తెలియగానే రేవంత్ రెడ్డి స్పందించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఇందులో కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. పెద్ది ప్రాణాలను కాపాడేందుకు కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గులాబీ పార్టీ నేతలు పర్యవేక్షించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో కూడా రాజకీయం చేయడం ఆ పార్టీ బేలతనానికి నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.