Donald Trump: ఏడాదిన్నరగా భారత్కు ట్రంప్ పీడ పట్టుకుంది. భారతీయ యువత డాలర్ డ్రీమ్ను ట్రంప్ కల్లలు చేశాడు. ప్రతీకార సంకాల పేరుతో భారతీయ వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాడు. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలను దెబ్బతీశాడు. గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనే యువతను లక్ష్యంగా చేసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం పని చేసేందుకు ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించాలనే ఆలోచన ట్రంప్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఓపీటీ తో ఉద్యోగం..
ఎఫ్–1 వీసాపై అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులు కోర్సు ముగిసిన తర్వాత తమ అధ్యయన రంగంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఓపీటీ ద్వారా లభిస్తుంది. సాధారణ కోర్సుల వారికి గరిష్టంగా ఒక ఏడాది, సైన్స్–టెక్నాలజీ–ఇంజినీరింగ్–మ్యాథమెటిక్స్ విభాగాల వారికి మూడు సంవత్సరాల వరకు ఈ అనుమతి ఉంటుంది. ఈ కాలంలో అనుభవం సంపాదించి తర్వాత హెచ్–1బీ వర్క్ వీసా కోసం ప్రయత్నించే వారు చాలా మంది.
ఫీజు భారీగా పెంపు..
ట్రంప్ ఫీఝు పెంపు ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రతిపాదిత ఫీజును విద్యార్థులు చెల్లించాలా లేక ఉద్యోగం ఇచ్చే సంస్థలు భరించాలా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే చాలా మందికి భారం అవుతుంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించేందుకు వెనుకాడే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ వారికి అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ విద్యార్థులపై ప్రభావం
అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయులు ప్రధాన వర్గంగా ఉన్నారు. లక్షలాది మంది అక్కడ చదువుతున్నారు. కేవలం డిగ్రీ కోసం కాకుండా చదువు తర్వాత అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో చాలా మంది వెళ్తున్నారు. కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో ఈ భారీ ఫీజు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతుంది.
వీసా నిబంధనల్లో మరో మార్పు
ఓపీటీ ఫీజుతోపాటు మరో కీలక ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పటివరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పద్ధతిలో కోర్సు కొనసాగినంత కాలం ఉండే అనుమతి ఉండేది. కొత్త ఆలోచన ప్రకారం గరిష్టంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని, అంతకు మించి ఉండాలంటే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
విదేశీ విద్యార్థులను దూరం చేసే ప్లాన్..
వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు దూరం చేసే ఆలోచనగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
లక్ష డాలర్ల ఓపీటీ ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. తుది నిర్ణయం రాలేదు. అయినా వలస విధానంలో క్రమంగా కఠిన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ కొనసాగించాలనుకునే భారతీయ విద్యార్థులకు మార్గం మరింత ఖరీదైనదిగా మారుతుంది.