లాక్ డౌన్ పూర్తి కాగానే జూన్ లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ సమావేశాలను జరిపేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణహించినట్లు తెలిసింది. అందుకోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
వాస్తవానికి మార్చ్ లోనే ఈ సమావేశాలు జరుగవలసి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా జరపలేక పోయారు. లాక్ డౌన్ కూడా ప్రకటించడంతో సమావేశాలను మూడు నెలలపాటు వాయిదా వేశారు. మూడు నెలల కాలానికి ప్రభుత్వం ఓట్ ఆన్ అక్కౌంట్ ద్వారా బడ్జెట్ను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం పొందారు.
ఈ గడువు కూడా జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్కు శాసనసభ నుండి ఆమోదం పొందాలని బావిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. జూన్లోగా కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఒకవేళ వైరస్ ఉధృతి తగ్గకపోయినా అవసరమైన జాగ్రత్తలతో జూన్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభత్వుం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. జూన్ లోగా పార్లమెంట్ ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. దానితో మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆసక్తి కలిగిస్తుంది.
మరోవైపు సిఆర్డిఎ రద్దు బిల్లును శాసనసభ ఆమోదించినా, మండలి తిరస్కరించి సెలక్ట్ కమిటీకి పంపింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలు సహితం జూన్ లో ఉండే అవకాశం ఉంది.