దేశం అంతటా కరోనా మహమ్మారిపై ప్రజలు, ప్రభుత్వాలు పోరాటం చేస్తుంటే హైదరాబాద్ లోని పాతబస్తీలో మాత్రం ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహింపవలసి వస్తున్నది. ఇక్కడ రాజకీయంగా ప్రాబల్యం గల ఎంఐఎం శాసన సభ్యులు, వారి నాయకులు బహిరంగంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ప్రేక్షకపాత్ర వహించడం తప్ప పోలీసులు ఏమీ చేయలేక పోతున్నారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేయడంలో ఉత్సాహం చూపిన పోలీసులు ఎంఐఎం ఎమ్యెల్యేలు, నాయకులూ బహిరంగంగా ఉల్లంఘలకు పాల్పడుతున్నా స్పందించరా అని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. వారి ఆగడాల కారణంగా పాతబస్తీలో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు నిస్సహాయ పరిస్థితులలో చిక్కుకు పోయారని విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే దబీర్పుర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్ను బలవంతంగా తొలగించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ వలే వ్యాపించినా పోలీసులు నిస్సహాయంగా ఉండటం గమనార్హం.
పైగా, పోలీసుల అనుమతితోనే ఆ ఎమ్యెల్యే నిబంధనలను ఉల్లంఘించారని అంటూ పోలీసులు తమ నిస్సహాయ పరిస్థితిని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా రాకపోకలకు ఆంక్షలుగా ఉంచిన బారికేడ్ ను తొలగించమని పోలీసులు వేరేవారికి అనుమతి ఇస్తారా? తొలగించవలసిన అవసరం వస్తే వారే వెళ్లి తొలగిస్తారు.
ఓ వైపు ప్రజలకు మంచిగా కనిపిస్తూ మరోవైపు తన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిబంధనలను ఉల్లంఘించమని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ స్పష్టం చేశారు.