Homeలైఫ్ స్టైల్After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. ఈ సమయంలో కొన్ని అలవాట్లు ఆ ప్రక్రియకు ఆటంకం కలిగించి అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. భోజనం చేసిన తరువాత ఎటువంటి అలవాట్లు ఉండకూడదు?

భోజనం చేసిన వెంటనే టీ తాగొద్దు:
చాలామందికి భోజనం తర్వాత వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే టీలో ఉండే టానిన్లు, కేఫిన్ వంటి పదార్థాలు ఆహారంలో ఉండే ఐరన్, జింక్ వంటి ఖనిజాల శోషణను తగ్గించే అవకాశం ఉంది. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందకపోవచ్చు. కొందరిలో జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా కనిపించవచ్చు. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు:
భోజనం చేసిన వెంటనే అధికంగా నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుందని చాలామంది భావిస్తారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల కొందరికి కడుపు నిండిన భావన, అసౌకర్యం కలగవచ్చు. అయితే భోజనం సమయంలో లేదా తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు తాగడం సాధారణంగా సురక్షితమే. దాహంగా ఉంటే అవసరమైనంత నీరు తాగవచ్చని వైద్యులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకండి:
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. స్నానం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రతలో మార్పులు రావడం వల్ల రక్తప్రసరణలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. జీర్ణక్రియ కోసం అవసరమైన రక్తప్రసరణపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల తర్వాత స్నానం చేయడం ఉత్తమం.

స్మోకింగ్ అత్యంత ప్రమాదకరం:
భోజనం చేసిన వెంటనే సిగరెట్ కాల్చడం అత్యంత హానికరమైన అలవాట్లలో ఒకటి. నికోటిన్, ఇతర విషపూరిత రసాయనాలు శరీరంలోకి చేరి గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. భోజనం తర్వాత స్మోకింగ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుంది?:
భోజనం చేసిన వెంటనే మంచంపై పడుకోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చు. ముఖ్యంగా కొందరిలో కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం వల్ల గుండెల్లో మంట (ఆసిడ్ రిఫ్లక్స్), అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే తరచూ ఇలా చేస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరి భోజనం తర్వాత ఏం చేయాలి?
భోజనం చేసిన వెంటనే కూర్చుని ఉండటం లేదా పడుకోవడం కంటే 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే భోజనం తర్వాత శరీరానికి విశ్రాంతి ఇచ్చేలా ప్రశాంతంగా ఉండటం, అధిక శారీరక శ్రమను వెంటనే చేయకుండా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular