
తెలంగాణ సీఎం కేసీఆర్ కు గడ్డు రోజులు ముందున్నాయా? ఇన్నాళ్లు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిన ఆయనకు తెలంగాణలో ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా? కేసీఆర్ హనీమూన్ ముగిసినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడం.. గాంధీలో అధమంగా ఆస్పత్రి నిర్వహణతో జర్నలిస్టు మనోజ్ మరణం.. గాంధీ డాక్టర్లపై దాడులతో రోడ్డెక్కిన పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్టుగా కనిపిస్తోంది.
2014లో అధికారంలోకి వచ్చింది మొదలు కేసీఆర్ అప్రతిహతంగా పాలనను సాగిస్తూనే ఉన్నాడు. తిరుగులేని నేతగా వెలుగొందుతున్నాడు. ప్రతిపక్షం అనేది లేకుండా తన పాలనను సాగిస్తున్నాడు. ఒక రకంగా మీడియా కూడా కేసీఆర్ పాలనను పెద్దగా వ్యతిరేకించింది లేదు.
కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నింటికన్నా ఎక్కువగా తెలంగాణ ఆత్మగౌరవం వంటి వాటిని ఫోకస్ చేయడంతో ఇన్నాళ్లు వ్యతిరేకత రాలేదు.
తెలంగాణలో కరోనా వైరస్ టెస్టులు చేయడం లేదని హైకోర్టులు, జాతీయ మీడియా కూడా వేలెత్తి చూపుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో ముఖ్యంగా పాతబస్తీలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా కేసీఆర్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. పాతబస్తీతో ఇతర ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డాక్టర్లు వసతులు, డాడులపై రోడ్డెక్కడంతో పరిస్థితి చేయిదాటుతోంది. వందలాది మంది వైద్యులకు కరోనా సోకుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని వారంతా వాపోతున్నారు. ఇక జర్నలిస్టులను ఆదుకోవడం లేదన్న అపవాదు ఉంది.
కరోనా మొదలైనప్పటి నుంచి వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇన్నాళ్లు అన్నింటిని మేనేజ్ చేశారు. కానీ తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మీడియాకు దూరంగా ఉండడంతో కేసీఆర్ హనీమూన్ పీరియడ్ ముగిసినట్టేనన్న చర్చ మొదలైంది.
-నరేశ్ ఎన్నం