మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలుగా సినిమా తీయలేదు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోసారి మహేష్ తోనే సినిమా చేయడానికి కూర్చున్నాడు. సూపర్ స్టార్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. కానీ.. మహేష్ ను మెప్పించే కథను ఈ సారి సిద్ధం చేయలేకపోయాడు వంశీ. అందువల్ల.. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ సినిమాకు అంగీకరించలేదు ప్రిన్స్.
దీంతో.. వంశీ పరిస్థితి డైలమాలో పడిపోయింది. మహేష్, నాగార్జున లాంటి హీరోలతో కలిసి పనిచేసిన తర్వాత చిన్న హీరోలను డైరెక్ట్ చేసే పరిస్థితి లేదు. దీంతో.. టాప్ స్టార్లనే టార్గెట్ చేశాడు. కానీ.. ఎక్కడా వర్కవుట్ కాలేదు.
అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదని సమాచారం. బన్నీ కథ బాగుందని చెప్పాడని ప్రచారం కూడా జరిగింది. మరి, తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. అనౌన్స్ మెంట్ రాలేదు. ఇటు రామ్ చరణ్ కు సైతం ఓ కథ వినిపించాడట. కానీ.. అది కూడా సెట్ కాలేదని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఏకంగా మెగాస్టార్ నే టార్గెట్ చేశాడట వంశీ. చిరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఈ ధైర్యం చేయడానికి కారణాలు కూడా చూపిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వేగంగా సినిమాలు ప్రకటిస్తున్న మెగాస్టార్.. డైరెక్టర్ స్టేటస్ ఏమీ చూడట్లేదు. కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.
ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయిన దర్శకుడు మెహర్ రమేష్ కు మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు బాబీని కూడా తీసుకున్నారు. ఈ కోణంలో తాను కూడా ప్రయత్నం చేయడంలో తప్పులేదనుకున్నాడట వంశీ.
ఈ క్రమంలో మెగాస్టార్ టైమ్ తీసుకొని కథ కూడా వినిపించాడట. మరి, ఆ స్టోరీ చిరుకు నచ్చిందా? దానిపై మెగాస్టార్ ఏమంటారు అన్నది తెలియాలి. ఈ కాంబో గనక ఓకే అయితే.. వంశీ రేంజ్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పొచ్చు. ఒకవేళ నో అంటే మాత్రం.. వంశీ ఇబ్బందులు కంటిన్యూ అవుతాయి. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.