Aranya: బాహుబలి ఘనవిజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఈ దగ్గుబాటి హీరో. అయితే మొదటి నుంచి వినూత్న కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా … ఈ ఏడాది మార్చి 26న విడుదలైంది. కానీ కరోనా పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత కలెక్షన్ లను రాబట్టలేకపోయింది.
ఈ మూవీ విషయానికి వస్తే విశాఖపట్నం సమీపంలోని చిలకలకోన అడవి. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే కుటుంబంలో పుట్టి పెరుగుతాడు హీరో రానా. ఏనుగుల రక్షణ కోసం కృషి చేసినందుకు గానూ… ఆయనకు ఫారెస్ట్ మేన్గా రాష్ట్రపతి అవార్డు సాధిస్తాడు. అదే సమయంలో కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం చిలకలకోన అడవిపై కన్నేస్తాడు. అడవిని నరికి అక్కడ టౌన్షిప్ కట్టేందుకు ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఆయన ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న ఏనుగులు అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిపై రానా ఎలా పోరాటం చేశారు… అడవిని ఎలా దక్కించుకున్నారన్నది కథ.
అయితే… ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. దసరా కానుకగా ఈరోజు నుంచి జీ5 లో ‘అరణ్య’ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రియ, జోయా హుస్సేన్లు ప్రముఖ పాత్రల్లో కన్పించనున్నారు. ఈ చిత్రానికి శాంతను సంగీతం అందించగా… తెలుగు, తమిళం , హింది భాషల్లో రిలీజ్ అయ్యింది ఏరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.