మా ఎన్నికల వేళ మోహన్ బాబు పేరు బాగా వినిపిస్తోంది. మా అధ్యక్ష ఎన్నికలకు మంచు విష్టు పోటీ చేయడంతో ఆ కుటుంబంపై చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఓ చానల్ మోహన్ బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దానికి ఆకట్టుకునే జవాబులు చెప్పారు మోహన్ బాబు. అందులో కొన్ని ఆసక్తికర ముచ్చట్లు మీకోసం…
ఆయన నటిస్తే ఆ పాత్రకే అందమొస్తుంది. ఆయన నిర్మిస్తే ఆ చిత్రానికే వన్నె వస్తుంది. ఆయన అల్లుడిగా అల్లరి చేస్తారు. పెదరాయుడిలా గర్జిస్తారు. ఆయన ఎంతో కఠినంగా కనిపిస్తారు. కానీ ఎవరైనా కన్నీరు కారిస్తే కరిగిపోతారు. ఎవరికైనా కష్టమొస్తే నీనున్నానంటూ ముందుకొస్తారు. ఆయనే.. నటుడు, నిర్మాత, విద్యావేత్త డాక్టర్ మోహన్ బాబు. 1975లో స్వర్గం నరకం చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత ఎన్నోపాత్రల్లో ఒదిగిపోయారు. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మోహన్ బాబు రాజసం చూసి పుట్టుకతోనే తిరుగులేని జీవితం అనుకుంటారంతా? కానీ.. సినిమాల్లోకి రావడానికి ఆయనా ఎన్నో కష్టాలు పడ్డారు. దొండ బండి ఎక్కి చెన్నై చెక్కేశారు. అక్కడికి వెళ్లి ఏం చేయాలో తెలియక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. ఎవరిని కలవాలో తెలియక… మళ్లీ ట్రైన్ ఎక్కి ఊరికొచ్చేశాడు. టీసీ వస్తే భయపడి బాత్రూమ్ లో దాక్కున్నాడు. చివరికి నాన్న చేతిలో పిచ్చి పిచ్చిగా తన్నులు తిన్నాడు. ఆ తర్వాత మళ్లీ చెన్నై బయలుదేరాడు. పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించేశారు. విలక్షణ నటుడిగా తెరపై ఆయన పేరును లిఖించేసుకున్నారు.
మోహన్ బాబు కులవ్యవస్థకు వ్యతిరేకం. కానీ అన్ని కులాలను గౌరవిస్తారు. ఆయన జీవితంలోనే కాదు.. అదే సంస్కారాన్ని తన పిల్లలకూ పంచారు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్థాపించిన శ్రీ విద్యానికేతన్ కులాన్ని పారదోలడంలో కృషి చేస్తుంది. అక్కడి విద్యార్థులకు కులం పేరు లేకుండా చేసేందుకు శ్రమిస్తారు. అందుకే.. శ్రీ విద్యానికేతన్ లో చేరాలంటే కులం ఉండకూడదనే నిబంధన పెట్టారు.
మోనన్ బాబును కులం కారణంగా ఓ సారి ఉద్యోగంలో నుంచి తీసేశారట. అప్పుడే ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నారు. కులమనే దాన్ని దరిచేరనీయోద్దని. విద్యార్థులతోనే నవశకం సాధ్యమని నమ్మారు. అందుకే శ్రీ విద్యానికేతన్ కు బీజం వేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి శివాజీ గణేషన్, చిరంజీవి ముఖ్యఅతిథులుగా వచ్చారట. ఆ పాఠశాలను వారే ప్రారంభించారు. ఈ విషయాన్ని మోహన్ బాబే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు.
నందమూరి తారకరామారావు అంటే మోహన్ బాబుకు ఎనలేని అభిమానం. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చారు. గొప్ప విషయం ఏంటంటే.. ఆదే ఎన్టీఆర్ తో కలిసి మోహన్ బాబు నటించారు. అందరినీ మెప్పించారు. అభిమాన నటుడు ఎన్టీఆర్ చేత శెభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అందరితోనూ కలిసి నటించారు. అయితే.. ఇప్పటికీ ఎన్టీఆరే తన అభిమాన నటుడని మోహన్ బాబు చెబుతుంటారు. ఆర్టీవీతోనూ తనకు ప్రత్యేక బంధం ఉందని మోహన్ బాబు తెలిపారు. రామ్ గోపాల్ వర్మ తండ్రి మోహన్ బాబుకు ఎంతో సన్నిహితుడట. ఆయన డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. టెక్నిషియన్ గా ఆర్జీవికి ఆల్వేస్ హ్యాట్సాప్ అని మోహన్ బాబు ఆకాశానికి ఎత్తేశారు.
టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారు మోహన్ బాబు. ఇప్పుడు ఆ సేవలను ఇంకాస్త విస్తరించే పనిలో పడ్డారు. మంచు విష్ణుకు ఆ బాధ్యతలు అప్పగించారు. అందరి సలహాలతో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రకాశ్ రాజ్ వంచి పెద్ద నటుడితో పోటీకి సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు తలపించేలా సాగుతున్న మా పోరులో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో.. మోహన్ బాబు వ్యూహం ఫలిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే!