హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకన్నాడు ఆది పినిశెట్టి. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు అతను. తెలుగుతో పాటు తమిళ్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ కు అన్న క్యారెక్టర్లో అద్భుతంగా నటించిన ఆది.. అంతకుముందు ‘సరైనోడు’లో స్టయిలిష్ విలన్గా అదరగొట్టాడు. ‘నిన్ను కోరి’లో భావోద్వేగాలు నిండిన కీలక పాత్రలో తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరెక్కుకుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో కూడా ఆదికి చాన్స్ వచ్చిందన్న వార్తలు వచ్చాయి. గంధం చెక్కల స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో నడిచే మూవీలో బన్నీకి అన్నయ్యగా, గ్రామ సర్పంచ్ పాత్రలో కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సరైనోడు టైమ్లో బన్నీతో, రంగస్థలం మూవీ ద్వారా డైరెక్టర్ సుకుమార్ తో ఆదికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఈ ఇద్దరితో సన్నిహితంగా ఉండడంతోపాటు అద్భుతమైన నటుడు కావడంతో ‘పుష్ప’లో అతనికి చాన్స్ రావడంలో ఆశ్చర్యం లేదని అందరూ భావించారు. అయితే, ఈ మూవీలో తాను నటిస్తున్నానన్న వార్తలను ఆది ఖండించాడు. అవన్నీ పుకార్లే అంటున్నాడు. ‘పుష్ప’ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేరని స్పష్టం చేశారు. కానీ, చాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోనని చెప్పాడు. ప్రస్తుతం నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య తీస్తున్న ‘క్లాప్’ సినిమాలో కూడా ఆది యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో అతను క్రీడాకారుడిగా కనిపిస్తాడు.