దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడు సంవత్సరాల కాలపరిమితితో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 8,500 ఉద్యోగాలకు ఎస్బీఐ నోటిఫికేషన్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా అప్రెంటీస్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. 8500 ఉద్యోగ ఖాళీలలో జనరల్ అభ్యర్థులకు 3595 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 1945 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 1388, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 844, ఎస్టీ అభ్యర్థులకు 725 పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1100 ఖాళీలు ఉన్నాయని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో 620 ఖాళీలు ఉండగా తెలంగాణలో 460 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఒక రాష్ట్రం నుంచే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉండాలి. ఈ ఉద్యోగాలకు మొదట రాతపరీక్ష ఆ తరువాత లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.
రాత పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. గంట సమయంలోపు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండటం వల్ల తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను ఎంచుకుంటే మంచిది.