AP 10th Results : చదువు పేదరికాన్ని జయిస్తుంది..చదువు మంచి భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుంది..చదువు సమాజంలో గౌరవాన్ని నిర్దేశిస్తుంది..చదువు ఒక పేద కుటుంబంలో వెలుగు నింపుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చదువు అనేది ఒక అనిర్వచనీయమైనది. కొన్నాళ్ల పాటు చదువును ఇష్టపడితే… అదే చదువు మన జీవితంలోని కష్టాలన్నింటినీ మాయం చేస్తుంది.ఇది అక్షర సత్యం. అక్షరాల నిజం. ఎన్నో కుటుంబాల్లో చదువు వెలుగులు నింపిందన్నది వాస్తవం. పేదరికాన్ని జయించే సాధనం కూడా చదువే.
తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అసమాన ప్రతిభ కనబరిచారు.కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా.. విపత్కర పరిస్థితులు ఎదురైనా మంచి ఉత్తీర్ణత సాధించిన వారు ఉన్నారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన నవీన పరిస్థితి తెలిస్తే ఎవరికైనా దుఃఖం రాక మానదు. ప్రతికూల పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆమె 500కు పైగా మార్కులు సాధించి అబ్బురపరిచారు. వారంలో మూడు రోజులు పాటు బడికి వెళ్ళినా చదువులో మాత్రం విశేషంగా రాణించిన ఆమె కథ వెనుక కన్నీటి వ్యధ ఉంది.
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటన హాలుకు చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె నవీన పదో క్లాస్ చదువుతోంది. కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి సాధారణ వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ జీవనం కూడా అంతంత మాత్రమే.దీంతో నవీన వారంలో మూడు రోజులు పాటు కూలి పనులకు వెళ్లి.. మిగతా మూడు రోజులపాటు పాఠశాలకు వెళ్ళేది. ఆ విద్యార్థి పరిస్థితిని చూసిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఫీజులతో పాటు పుస్తకాలు సమకూర్చారు. దీంతో ఖాళీ సమయాల్లో నవీన కష్టపడి చదువుకునేది. కూలి పనులకు వెళ్ళగా మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేది. సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. 600 మార్కులకు గాను నవీన 509 మార్కులు సాధించి గ్రేట్ అనిపించుకుంది. మట్టిలో మాణిక్యాలు గా ఉండే ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాగా నవీనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి