YSR Congress Party : కింద పడిపోయిన పై చేయి తనదే అన్నట్టు ఉంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పరిస్థితిని చూస్తూ వస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది ఆ పార్టీ. ఇప్పటికీ ఆ పార్టీని అభిమానించే వారి కంటే ద్వేషించే వారి సంఖ్య ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో 39 శాతానికి పైగా ఓట్లు సాధించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించుకుంటోంది. కానీ ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ వ్యవహరించిన తీరుతో ఆ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుందే తప్ప పెరగడం లేదు. ఇటువంటి తరుణంలో 2014 నుంచి 2019 మధ్య వేసిన ఎత్తుగడలను ఆ పార్టీ అనుసరిస్తోంది. సర్వేల పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టించాలని చూస్తోంది. ముఖ్యంగా విద్యాధికులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవారు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు చేపడుతున్న కూటమి పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి సమయంలో సర్వేల పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంస్థలను రంగంలోకి దించింది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటుంది. కనీసం క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా.. ఊరు పేరు లేని సర్వే సంస్థల పేరుతో ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వెగటు పుట్టిస్తున్నాయి.
* ఐఐటీ నిపుణుల పేరుతో..
హైదరాబాద్ ఐఐటీ నిపుణుల పేరుతో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెబుతోంది. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని చెబుతూ వస్తోంది ఆ సర్వే. అయితే ఇది ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు. గణాంకాల పేరుతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చెప్పే ప్రయత్నం గా స్పష్టంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? అనేది ప్రశ్న. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాలనే కూటమి అమలు చేస్తోంది. ఆపై వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను కొలిక్కితీస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కోస్తాంధ్రలో భాగమైన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు జలాలు అందిస్తోంది. పట్టిసీమ పథకంతో కరువు ప్రాంతంలో సైతం సిరులు చూపిస్తోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చేపడుతున్న ప్రభుత్వాన్ని కాదని వైసీపీని కోరుకుంటున్న ప్రజలు ఎవరు? ఇది నిజంగా జిమ్మిక్కు. సర్వేల పేరుతో గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే తప్ప.. మరొకటి కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.
* ప్రజలు బుద్ధి చెప్పినా..
2024 ఎన్నికల్లో కూడా సర్వేల పేరుతో ప్రజల్లో ఒక రకమైన అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అవన్నీ ఫేక్ అని ప్రజలు తేల్చేశారు. వార్ వన్ సైడ్ అన్నట్టు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ప్రజా తీర్పును గుణపాఠంగా మార్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ సోషల్ మీడియాలో సొంత ప్రచారం, ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఏపీ ప్రజలను చాలా తక్కువ చేసి చూస్తున్నారు. అందుకే మూడ్ ఆఫ్ నేషన్, ఐఐటి నిపుణులు వంటి పేరుతో సర్వేలను రంగంలోకి దించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన చేసిన ప్రయోగాలు అంతా ఇంతా కాదు. దాదాపు గతంలో సక్సెస్ అయిన సర్వే సంస్థలను తనకు అనుకూలంగా మార్చుకొని.. తనదే విజయం అని చెప్పుకొని.. ఊరు వాడ ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజా తీర్పును మార్చలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తప్పిదాలు తెలుసుకొని.. సరి చేసుకుని.. ముందుకు సాగితే తప్ప ఫలితం ఉండదు. ఇలాంటి సర్వేలు వృధా ప్రయాస తప్ప.. ప్రయోజనం చేకూర్చే ఛాన్స్ లేదు. ఇక తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.