YSRCP: ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీని గట్టెక్కించడానికి కొంతమంది చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నంతకాలం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అందరికీ తెలుసు. అందుకే కూటమిలో విభేదాల కోసం కుహనా మేధావులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మేధావుల ముసుగులో వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్, ఫ్లేవర్ కనిపిస్తోంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపిని తాత్కాలిక భాగస్వామిగా.. జగన్మోహన్ రెడ్డిని సుదీర్ఘకాలం స్నేహితుడిగా అమిత్ షా పవన్ కళ్యాణ్ తో అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. దానిని వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రొజెక్టు చేస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
* జగన్ కు అనుకూలం
ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుంది. కొద్ది రోజుల కిందట జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారట.. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరారట.. అందుకు అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించారట.. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని చెప్పారట.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడట.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారట.. అదే విషయాన్ని కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తో చెప్పించారట.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. దానిపై వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
* క్లాస్ పీకితే పవన్ ఊరుకుంటారా..
ఒక్క మాట అనుకుందాం. అమిత్ షా కేంద్ర హోం మంత్రి కావచ్చు. బిజెపిలో నెంబర్ 2 కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం. ఒకరితో క్లాస్ పీకించే పరిస్థితి ఉండదు. అంతవరకు రానివ్వరు కూడా. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు విశ్లేషణ చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన భావనగా చెప్పవచ్చు. కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం గా భావించవచ్చు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అర్జెంటుగా ఇప్పుడు టిడిపితో జనసేన విడిపోవాలి. బిజెపి సహకారం అందకూడదు. ఇప్పుడు అదే భావనతో ఈ కుహనా మేధావులు రంగంలోకి దిగుతున్నారు. అయితే గతం మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారి విశ్లేషణను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. సమకాలీన రాజకీయ అంశాలపై లోతైన విశ్లేషణ ఆయన చేయవచ్చు కానీ.. ఎవరి భావజాలం ఎలా ఉంటుందో.. ప్రజలు ఇట్టే పసిగట్టేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ.. దానికి సోషల్ మీడియాలో ఇస్తున్న హైప్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీని వెనుక ఉన్న పరమార్ధాన్ని గ్రహిస్తున్నారు.
