Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అలా కాకుంటే తప్పించేస్తాను అంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి పార్టీ నుంచి అవుట్ కావడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయనకు జగన్మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వరని కూడా తెలుస్తోంది. ఆయన మూలంగానే నెల్లూరు జిల్లాలో పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికలకు ముందు చాలామంది బలమైన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గ పరిణామాలు కూడా జరిగాయి. అందుకే నెల్లూరులో అసలు అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* రెడ్డి సామాజిక వర్గం దూరం..
నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడానికి అదే ప్రధాన కారణం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సొంత సామాజిక వర్గానికి కాదని అనిల్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలను లెక్కచేయలేదు. తనదంత జగన్ తో అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని సైతం అనిల్ కుమార్ యాదవ్ చాలా తక్కువ చేసి చూశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం పార్టీలో ఉండలేదు. మిగతా రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం అనిల్ కుమార్ యాదవ్ వైఖరి తోనే బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ను పంపించారు.
* కనిపించని నేత..
నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత అస్సలు కనిపించలేదు ఆ నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లాలో కూడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామంతో అనిల్ కుమార్ యాదవ్ కు కూడా అర్థమైంది. కానీ ఆయనకు ఉన్నది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ మాత్రమే. టిడిపి తో పాటు జనసేన విషయంలో అనిల్ ఎంతలా మాట్లాడారో తెలియనిది కాదు. ఆ రెండు పార్టీలను కాదని బిజెపి తీసుకునే అవకాశం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ కార్యకలపాల్లో పాల్గొనడం లేదు. అసలు ఏపీ వైపు చూడడం కూడా లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
