AP DSC 2025 : నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు ఏంట్రా.. కొన్నేళ్ల కిందట అతడు సినిమాలో వచ్చిన డైలాగ్ ఏది. అనవసరంగా హీరోతో పెట్టుకుని లేనిపోని కష్టాలు వద్దురా అని కమెడియన్ తో చాలా సున్నితంగా చెప్పుకొచ్చారు దర్శకుడు. ఇప్పుడు అదే నిప్పుతో గేమ్ ఆడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ నిప్పు ఏంటంటే డీఎస్సీ 2025. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ డీఎస్సీ ప్రక్రియపై విషం చిమ్ముతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతోంది. చివరకు కోర్టులకు వెళ్ళింది కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి విచారించకుండానే కోర్టు కొట్టి వేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జడ శ్రావణ్ కుమార్ సైతం దీనిని తప్పుపడుతున్నారు. వేలాదిమంది ఉపాధ్యాయులతో ఆటలాడుతున్నట్టే అని ఆయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు అని సలహా ఇచ్చారు. కానీ ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ది సోలో పెర్ఫార్మెన్స్.
* అప్పట్లో మెడికల్ కాలేజీల అంశంలో..
గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ నానా యాగి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రోజుల తరబడి ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సంతకాలను సేకరించింది. అటు తర్వాత ఉద్యమం ఎటు వెళ్లిపోయిందో తెలీదు. ఇప్పుడు డీఎస్సీ పై పడింది ఆ పార్టీ కన్ను. దీంతో రాష్ట్రవ్యాప్త ఉద్యమమే చేపట్టింది. అయితే ఎవరి కోసం ఈ ఆందోళనలు జరుపుతున్నారో వారు అక్కడ కనిపించడం లేదు. డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల జాడలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిబిరాల్లో. దీనిని ఒక జెన్ జీ ఉద్యమ స్థాయిలో చూపిస్తోంది. కానీ అక్కడ నిరుద్యోగ యువత కూడా కనిపించడం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం పూర్తిగా స్పష్టత వచ్చింది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు 16 వేల మంది. డీఎస్సీ రాసి ఉద్యోగాలు రాని వారు 3 లక్షలకు పైగా. అలా 16,000 మంది తమకు వ్యతిరేకమైన.. లక్షల మంది తమకు.. తమ పార్టీకి అండగా నిలుస్తారని గాల్లో లెక్కలు వేసుకుంటుంది ఆ పార్టీ. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ పరిస్థితులు ఉన్నాయి.
* కచ్చితంగా వ్యతిరేకమే..
సమాజం పట్ల అవగాహన ఉన్న ఏకైక వర్గం ఉపాధ్యాయ వర్గం. సహజంగానే ప్రభుత్వాల పట్ల ఈ వర్గం వ్యతిరేకంగా ఉంటుంది. తమ ప్రయోజనాల కోసం ఎక్కువగా పోరాటం చేసేది కూడా ఈ వర్గమే. అటువంటిది డీఎస్సీలో అక్రమాలు గురించి.. అసలు వాస్తవాలు గురించి ఈ వర్గానికి తెలుసు. కనీసం సాంకేతిక ఆధారాలు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆరోపణలు చేస్తోందో ఉపాధ్యాయ వర్గానికి తెలుసు. కేవలం డీఎస్సీ రాసిన ఉద్యోగం రాని మూడు లక్షల మంది.. ఆపై ప్రజల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తోంది వైసీపీ. కానీ అదే బురద తిరిగి తిరిగి తమపై పడుతుందన్నది గుర్తించలేకపోతోంది. క్షేత్రస్థాయిలో ఏదైనా ఉద్యమానికి, కార్యక్రమానికి అంత ఆదరణ దక్కకపోతే రాజకీయ పార్టీలు వ్యూహాలు మార్చుకుంటాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో ఈ విషయంలో వెనుకబడిందని చెప్పవచ్చు.