YSRCP Caste Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణలకు తెరతీసింది. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడింది. ప్రధానంగా కాపులతోపాటు బీసీలపై ఫోకస్ పెట్టింది. గతంలో బీసీలకు రాజకీయంగా అగ్ర తాంబూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాపులు కూటమి వైపు వెళ్లారని భావించి.. వారిలో చీలిక తేవాలని చూస్తోంది. మొన్ననే గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇప్పుడు విశాఖలో సమావేశం కావాలని నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కాపు నేతలంతా విధిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది.. సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, జోగి రమేష్ హాజరయ్యారు. ఒకవైపు బీసీ, మరోవైపు కాపు సామాజిక వర్గాల ద్వారా పూర్వ వైభవం పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
* విశాఖలో వైసీపీ కాపు నేతల సభ..
కాపు సామాజిక వర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనేది వైసిపి నుంచి వస్తున్న ఆరోపణ. మొన్నటి ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని ఆదరించారని.. కానీ అదే కాపులకు అన్యాయం జరుగుతోంది అంటే పవన్ మాత్రం పట్టించుకోవడంలేదని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. ఇటీవల కాపుల అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తూ.. కాపు నేతల ఆత్మీయ సమావేశాలు పెట్టాలని భావించింది. గోదావరి జిల్లాలో సభ జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆ పార్టీ తలపెట్టింది కాపుల సభను. ప్రధానంగా విశాఖ, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాలను టార్గెట్ చేసుకుంది వైసిపి. అక్కడ కాపుల్లో యూటర్న్ తీసుకురావాలన్నది ఆలోచన.
* బీసీ నినాదం..
మరోవైపు బీసీల సదస్సు కూడా జరపాలని నిర్ణయించింది. దానికి సన్నాహక సమావేశంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన విషయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో టిడిపి డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చిందని.. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ విధానం ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు ఒక వైపు కాపులు, మరోవైపు బీసీ నినాదాన్ని తీసుకొచ్చి పూర్వ వైభవం పొందాలన్నది వైసిపి వ్యూహంగా తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
