YS Sharmila: వైయస్ షర్మిల మౌనముద్ర పాటిస్తున్నారు. ఆమె పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఉన్నట్టుండి ఆమె మౌనం దాల్చడం మాత్రం.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. పిసిసి అధ్యక్షురాలిగా ఆమెను మార్చుతారన్న ప్రచారం ఒకవైపు.. ఇస్తామన్న రాజ్యసభ పదవి ఇవ్వకపోవడం ఇంకోవైపు.. సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోవడంతో ప్రాధాన్యత తగ్గుతుందని మరోవైపు.. ఇలా షర్మిల సైలెన్స్ వెనుక అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి. తరచూ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. ఉన్నట్టుండి సైలెంట్ కావడం చూస్తుంటే పెద్ద ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* సోదరుడిని విభేదించి..
రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంది. ఆమె జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు బలమైన మద్దతు దారుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో షర్మిలకు గుర్తింపు లేదు వైసీపీలో. ఆపై సోదరుడు జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత, కుటుంబ పరమైన విభేదాలు వచ్చాయి. అందుకే తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకున్నారు. వీలుకాకపోయేసరికి విభేదించిన కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరి.. ఏపీలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అపజయాన్ని శాసించగలిగారు షర్మిల.
* రాజ్యసభ పదవి హామీ..
అయితే ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయాలు అనేవి మారుతూ ఉంటాయి. అలా రాజకీయాలు మారిన క్రమంలోనే కాంగ్రెస్ వైఖరి జగన్ విషయంలో మారినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి ఇస్తామని షర్మిలకు హామీ ఉంది. ఆ హామీ అమలు చేయలేదు సరి కదా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరే నేతకు అప్పగించాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయస్థాయిలో కాంగ్రెస్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు కూడా టాప్ నడుస్తోంది.. ఈ పరిణామాల క్రమంలో షర్మిల ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేజారి పోతుండగా.. రాజకీయంగా తనకు ఎటువంటి ఉన్నతి లేకుండా పోయింది అనే ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. అందుకే సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెర వెనుక ఏం జరిగిందో వారికే తెలియాలి.
