Panchayat Elections In AP: ఏపీలో పంచాయతీ ఉప ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో జరిగిన స్థానాలన్నీ అధికార వైసీపీకి చెందినవే. రెండున్నర ఏళ్ల కిందట పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చాలాచోట్ల సభ్యుల మరణం, వివిధ కారణాలతో రాజీనామాలతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పార్టీలు భావించాయి. మొత్తం 26 జిల్లాల్లో 64 సర్పంచ్, 1001 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో 30 సర్పంచ్ స్థానాలు, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోలింగ్ జరిగింది.
34 సర్పంచ్ స్థానాల్లో అత్యధికం తమకే లభించాయని వైసీపీ ఒకవైపు,టిడిపి మరోవైపు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. సంబరాలు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. వైసీపీ అనుకూల మీడియా ఒకలా… టిడిపి అనుకూల మీడియా మరోలా కథనాలు వండి వారిస్తుండడంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు రహితంగా జరుగుతాయి. ఇక్కడ పార్టీ గుర్తు కనిపించదు. దీంతో గెలుపొందిన వారు తమ వారు అంటే.. తమ వారంటూ పార్టీలు తమ ఖాతాలోకి వేసుకోవడం ప్రారంభించాయి.
మొత్తం 34 సర్పంచులతో పాటు 243 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అధికార వైసీపీ మద్దతుదారులు 22 మంది సర్పంచులు గా గెలిచారు. మరొకచోట రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. పది చోట్ల మాత్రం విపక్షాలు గెలుపొందాయి. ఇందులో టిడిపి నేరుగా 8 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మరో రెండు చోట్ల మాత్రం జనసేన మద్దతుతో గెలుపొందింది.
అధికార వైసిపి గెలుచుకున్న స్థానాలను పక్కన పెడితే… విపక్షాలు విజయం సాధించిన సర్పంచ్ స్థానాలను పరిశీలిద్దాం.. శ్రీకాకుళం జిల్లా బొప్పడం, అల్లూరి సీతారామరాజు జిల్లా శోభకోట, అనకాపల్లి జిల్లా కొరుప్రోలు, పశ్చిమగోదావరి జిల్లా కావలిపురం, ప్రకాశం జిల్లా పాకాల, నెల్లూరు జిల్లా లింగరాజు అగ్రహారం, అనంతపురం జిల్లా జంగంపల్లిలో టిడిపి మద్దతుదారులు గెలుపొందారు. బాపట్ల జిల్లా మున్నంగి వారి పాలెం పంచాయితీని టిడిపి,జనసేన సంయుక్తంగా గెలుచుకుంది. ఇక వార్డు స్థానాలకు సంబంధించి వైసీపీ మద్దతుదారులు 141చోట్ల, తిరుగుబాటు అభ్యర్థులు రెండు చోట్ల, టిడిపి మద్దతుదారులు 90 చోట్ల, జనసేన మద్దతుదారులు ఐదుచోట్ల, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.
అయితే ఒకటి మాత్రం నిజం. అధికార వైసిపి పై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అంతకుముందు ఏకగ్రీవాలు చేసుకున్న చోట్ల కూడా బలవంతంగానే చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్ విత్ డ్రా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఒకటి రెండు చోట్ల విధ్వంసం కూడా చోటుచేసుకుంది. నిన్నటి పోలింగ్ లో కూడా ప్రలోభాలు వెలుగు చూశాయి. అయినా విపక్షాల మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపొందడం విశేషం. ఇప్పటికైనా అధికార పార్టీ పంచాయితీ ఉప ఎన్నికల్లో ఫలితాలపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.