AP Survey 2024: ఏపీలో హోరాహోరీ ఫైట్ నెలకొంది. వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండగా.. టిడిపి, జనసేన సీట్ల సర్దుబాటు పై దృష్టి సారించాయి. వీరితో బిజెపి కలుస్తుందా? లేదా? అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగించడం ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఏపీ ప్రజల మూడ్ పై తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. తమ నివేదికలను వెల్లడించింది.
స్కూల్ ఆఫ్ పాలిటెక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. టిడిపి, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి.. వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోనుందో స్పష్టమైన అంచనా వేసింది. ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలో సర్వేలు చేసింది. ఏపీలో సీఎం జగన్ కు ఆదరణ ఉన్నా.. ఓట్ల విషయంలోకి వచ్చేసరికి ఆ స్థాయిలో లేదని తేల్చేసింది. గతంలో మాదిరిగానే ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్లు వివరించింది.
అయితే రాష్ట్రంలో మూడు రీజియన్లను విభజించి ఫలితాలను వెల్లడించడం విశేషం. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలకు గాను వైసీపీకి 12 నుంచి 16 స్థానాలు, టిడిపి- జనసేన కూటమికి 18 నుంచి 22 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది.
* కోస్తాంధ్రలో మొత్తం 85 స్థానాలకు గాను.. వైసీపీకి 19 నుంచి 24 సీట్లు, టిడిపి- జనసేన కూటమికి 58 నుంచి 65 స్థానాలు వస్తాయని పేర్కొంది.
* రాయలసీమలో మొత్తం 55 స్థానాలకు గాను వైసీపీకి 36 నుంచి 40 సీట్లు, టిడిపి జనసేన కూటమికి 14 నుంచి 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
అయితే ఈసారి కోస్తాంధ్రలో స్పష్టమైన మెజారిటీ దిశగా టిడిపి- జనసేన కూటమి అడుగులు వేయడం విశేషం. ఉత్తరాంధ్రలో మాత్రం గట్టి ఫైట్ నెలకొంది. రాయలసీమలో మాత్రం వైసీపీ తన పట్టు నిలుపుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు వైట్ వాష్ చేసింది. 55 స్థానాలకు గాను.. గత ఎన్నికల్లో వైసిపి 52 చోట్ల విజయం సాధించింది. టిడిపి మూడు స్థానాలకి పరిమితమైంది. అయితే గత ఎన్నికల కంటే అదనంగా 15 స్థానాల వరకు టిడిపి, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తేల్చింది.