Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్( Jogi Ramesh) దూకుడు పెంచారు. ఏకంగా ఇప్పుడు ఆయన మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. అంబటి రాంబాబు ఆగ్రహంతో ఒకే ఒక్క మాట తూలారు. బూతు వ్యాఖ్యానాలు చేశారు. అయితే జోగి రమేష్ మాత్రం నోటికి పని చెప్పారు. లోకేష్ పై దారుణాతి దారుణంగా మాట్లాడారు. అందుకే టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆయన ఇంటిపై దాడి చేశాయి. అయితే జోగి రమేష్ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయన ఒక రకమైన దూకుడు చూపించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. మరోవైపు చంద్రబాబు సతీమణి విషయంలో తాము చేసింది తప్పే అని బాహాటంగానే ఒప్పుకున్నారు. అయితే అవన్నీ తనపై ఉన్న కేసుల తీవ్రత తగ్గించుకునేందుకే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకసారి తగ్గుతూ కనిపించేవారు.. మరోసారి దూకుడు కనబరిచారు. అయితే ఇటీవల కల్తీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. చాలా రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాయిస్ పెంచుతున్నారు. అందులో భాగంగానే లోకేష్ తీరుపై విపరీత వ్యాఖ్యానాలు చేశారు జోగి రమేష్.
టిడిపిలో చేరేందుకు ప్రయత్నం..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు జోగి రమేష్. కానీ తర్వాత అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు అరెస్టయ్యారు. దీంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో టిడిపి నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు. అయితే జోగి రమేష్ వ్యవహార శైలి ఏ టిడిపి నేత కూడా మరిచిపోలేదు. అందుకే టిడిపి నాయకత్వం జోగి రమేష్ తో వేదిక పంచుకున్న నేతలకు సంజాయిసి కోరింది. అయితే ఒకానొక దశలో జోగి రమేష్ టిడిపిలో చేరుతారని ప్రచారం నడిచింది. వైసీపీలో పనిచేసి టిడిపిలోకి వచ్చిన ఒక మంత్రి ద్వారా మంత్రాంగం నడుపుతున్నారన్నది అప్పట్లో జరిగిన చర్చ. ఆ సమయంలో తనకు తానుగా మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబు సతీమణి విషయంలో తాము వ్యవహరించిన తీరు తప్పు అని ఒప్పుకున్నారు.
టిడిపి నుంచి దక్కని ఆదరణ..
అయితే ఒకవైపు టిడిపి తో టచ్ లో ఉంటున్నా తగిన ప్రతిఫలం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం కుంభకోణంలో ఆయన చిక్కుకున్నారు. తంబళ్లపల్లెలో కల్తీ మద్యం డంప్ వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ భారీ ఆందోళన చేశారు. సాక్షి మీడియాకు తీసుకెళ్లి కల్తీ మద్యం డంపును బయటపెట్టారు. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక జోగి రమేష్ ఉన్నారన్న అనుమానాలు పెరిగాయి. ఆ వెంటనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ పేరును బయటపెట్టారు. దీంతో అడ్డంగా బుక్కయ్యారు జోగి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా వెళ్లి దాదాపు 80 రోజులు పాటు జైలు జీవితం గడిపారు. ఇప్పుడు బయటకు వచ్చాక తాను ఒక బీసీ నేతనని.. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తినని.. అందుకే తనపై కేసులు మోపుతున్నారని చెబుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో జోగి రమేష్ సామాజిక వర్గానికి చెందిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని వైసీపీ నేతల ప్రకటించినప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని? తన అక్కను వేధించవద్దు అంటూ కోరిన ఓ బాలుడిని వైసీపీ నేతలు హత్య చేసినప్పుడు ఎక్కడికి వెళ్లారని? బీసీ నాయకురాలు గౌతు శిరీషను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అనుచితంగా వ్యవహరించినప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని శ్రీశైన, గౌడ తదితర బీసీ వర్గాల నేతలు ఇప్పుడు జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అయితే జోగి రమేష్ వ్యవహార శైలి మాత్రం గందరగోళంగా ఉంది. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తోంది.