Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఏపీ లో సడెన్ గా పోస్టల్ బ్యాలెట్స్ పెరగడం దేనికి సంకేతం.....

AP Elections 2024: ఏపీ లో సడెన్ గా పోస్టల్ బ్యాలెట్స్ పెరగడం దేనికి సంకేతం.. ఎవరికి లాభం?

AP Elections 2024: ఏపీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష కూటమిల మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసిపి అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఎలాగైనా జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. బిజెపి మద్దతుతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఓటు కీలకంగా మారింది ముఖ్యంగా ఈసారి ఉద్యోగుల బ్యాలెట్ ఓటు ప్రాధాన్యత అంశంగా మారింది. పార్టీల గెలుపోటములను నిర్దేశించనుంది.ఏపీలో హోరా హోరీ ఫైట్ నేపథ్యంలో బ్యాలెట్ ఓటు కీలకంగా మారనుంది. తక్కువ ఓట్లతో గెలుపొటములు ఉంటాయని నిపుణులు భావిస్తున్న తరుణంలో బ్యాలెట్ ఓటు కీలక భూమిక పోషించనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈసారి శత శాతం ఓట్లు వేయడానికి మొగ్గు చూపించారు.

ఈనెల 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ దాదాపు ఆరు రోజులు పాటు కొనసాగింది. ఈనెల నాలుగున ప్రారంభమైన ఓటింగ్ 10వ తేదీ వరకు కొనసాగుతూనే ఉంది. ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితోపాటు 85 ఏళ్లు నిండిన వయోవృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈసారి నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార వైసీపీ పై ఉన్న అసహనం, ఆగ్రహం స్పష్టంగా కనబడింది. ఇప్పటివరకు అన్ని వర్గాలు తమ వైపు ఉన్నారని భావించిన వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వైసిపి పై ఉన్న సానుకూలత క్రమేపి తగ్గుముఖం పడుతోంది. సోషల్ మీడియాలో సైతం వ్యతిరేక విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగ ఉపాధ్యాయ ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు చేతులెత్తేసింది. సమయానికి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని.. టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని.. వారితో పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగించారని.. అన్ని శాఖల ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు.. తమ ఆగ్రహం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రూపంలో ఉద్యోగ ఉపాధ్యాయులు చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ లలో టిడిపి కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది.

అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ విపక్షనేతగా హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. తన పాలన 30 నెలలు గడిచిన తర్వాత.. ప్రభుత్వముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా క్షమించండి అని జగన్ ప్రకటించారు. అదో సాంకేతిక అంశమని.. తెలియకుండా హామీ ఇచ్చానని.. తప్పయిపోయిందని ప్రకటన చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వసతులను సైతం రద్దు చేశారు. జీతాలు సైతం సక్రమంగా చెల్లించలేదు. ఇవన్నీ ప్రతికూలత చూపాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగ,ఉపాధ్యాయుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళన సర్వత్ర వ్యక్తమవుతోంది. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత.. కూటమి వైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular