Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు అంతా ఓపెన్ అయ్యారు. తాను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను అనేదానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు పడి.. ఎన్నెన్నో అవమానాలు పడి.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. తన గౌరవాన్ని పెంచాల్సింది పోయి.. తగ్గించేసారని. తన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చారన్న బాధ ఆయనలో ఉంది. ఇన్నాళ్లు కోటరీ అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఆ కోటరి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న విషయాన్ని బయట పెట్టేశారు. 2020 తర్వాత తనను అడుగడుగునా అవమానాలకు గురిచేసారని.. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషించడంతోనే తాను బయటకు వచ్చాను అన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. తాను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించగానే నమ్మకద్రోహి అంటూ ప్రచారం చేస్తుండడం వల్లే తాను ఈ విషయంలో ఓపెన్ కావాల్సి వచ్చిందని చెప్పారు విజయసాయిరెడ్డి. నేరుగా సోషల్ మీడియా లోనే ఒక పోస్ట్ విడుదల చేసి.. అసలు తాను పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? పార్టీలో ఉన్నప్పుడు ఎంతలా అవమానాలు పడింది? సవివరంగా చెప్పే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి.
ఆయన కింద పనిచేయాలా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తనలాంటి ఎంతోమంది నాయకులు రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మాలాంటి వారిని కోఆర్డినేట్ చేసేందుకు రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించడాన్ని తప్పుపట్టారు. మిగతా సీనియర్ నేతలంతా ఆయన కింద పనిచేయవచ్చు కానీ.. తాను మాత్రం సజ్జల కింద పని చేయడం ఇష్టం లేక బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. తాను నమ్మకద్రోహి అయి ఉంటే ఎందుకు కూటమి ప్రభుత్వ హయాంలో కేసుల్లో నిందితుడిగా మారుతానని గుర్తు చేశారు. ఈ రెండేళ్ల కాలంలో ఒక్క ఛార్జ్ షీట్ లో అయినా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఉందా అంటూ ప్రశ్నించారు. టిడిపి కూటమి ప్రభుత్వంతో సజ్జల రాజీ పడ్డారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న తనను తొలగించిన నాటి నుంచి 2022 ప్లీనరీ వరకు అడుగడుగునా అవమానాలకు గురిచేసిన విషయాన్ని ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. త్వరలో పార్టీ మారబోయే ఉత్తరాంధ్ర మాజీ మంత్రి అంటూ ఓ సస్పెన్షన్ కూడా క్రియేట్ చేశారు.
పార్టీలో అణగదొక్కుతూ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి తన ప్రాధాన్యత తగ్గించారన్న విషయాన్ని ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వంతో పాటు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత తన ప్రాధాన్యత తగ్గిపోయిందని.. జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని చెబుతున్నారు. నమ్మకద్రోహం చేసి ఉంటే ఏనాడో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిండే వాడినని.. జగన్మోహన్ రెడ్డి తో పాటు కేసులకు గురైన తాను ఎందుకు నమ్మకద్రోహి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పార్టీని ఏర్పాటు చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత మాత్రమే తనపై నమ్మకద్రోహి అనే ముద్ర వేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని ఆరోపణలు చేసినా తాను వెనక్కి తగ్గేది లేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవి కూడా వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2029లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కూడా జోష్యం చెప్పారు. కచ్చితంగా అప్పుడు అంత తిట్టుకునేది జగన్మోహన్ రెడ్డికి కాదని.. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమేనని తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి తన మనసులో ఉన్న బాధనంతటిని బయట పెట్టేశారు.