Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం సక్రమంగా పని చేయలేని విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదన్నారు. అందుకే తను సొంత పార్టీ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో దానికి సంబంధించిన విధివిధానాలు విజయవాడ వేదికగా ప్రకటిస్తానని చెప్పారు..
* ఏడాదిన్నర కిందట రాజీనామా..
ఏడాదిన్నర కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ వచ్చిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో బయటకు వచ్చేసారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని ప్రకటించిన ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ అలా ఉండలేకపోయారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుండగా.. దానికి బ్రేక్ వేస్తూ సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. మొన్ననే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. విజయవాడ వేదికగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. అయితే డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఏకకాలంలో మీడియాతో పాటు రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్నది విజయసాయిరెడ్డి ప్రణాళిక.
* శాంతి భద్రతలపై..
కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పాలకపక్షం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షం సైతం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి అసమర్థ ప్రతిపక్ష నేతను ఎక్కడా చూడలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో తనకు ఎవరితో శత్రుత్వం లేదని.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. అయితే సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి.. ఆయన కోసం రాజకీయాలు చేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇప్పటికే విపక్ష నేత పాత్ర జగన్మోహన్ రెడ్డి పోషించడం లేదని అధికార కూటమి నుంచి ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి సైతం అటువంటి విమర్శల దాడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
“బయటకు చెప్పుకోలేక కుమిలి కుమిలి ఎడవాల్సి వస్తోంది…జగన్ మోహన్ రెడ్డి ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు..
పార్టీ ప్రకటనపై త్వరలోనే నా నిర్ణయం వెల్లడిస్తాను. నాకు ఎవరిపైనా ద్వేషం లేదు, శత్రుత్వమూ లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.”
– విజయసాయిరెడ్డి #VijayasaiReddy… pic.twitter.com/gV0FYlJdPb
— Telugu360 (@Telugu360) August 24, 2026