Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది హీటెక్కుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు ఒక్కొక్కరు పార్టీలను వీడుతున్నారు. అవకాశాలను వెతుక్కుంటూ వేరే పార్టీల్లో చేరుతున్నారు. టిడిపిలోకి ఈరోజు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ చేరనున్నారు. సీనియర్ నాయకుడు హరి రామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. మరో నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను సైతం వైసీపీలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
హరి రామ జోగయ్య చాలా రోజులుగా జనసేనకు అనుకూలంగా పనిచేస్తున్నారు. కాపు సంక్షేమ సేవా సంఘం తరఫున పవన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన కుమారుడు సూర్యప్రకాష్ జనసేనలో యాక్టివ్ గా పని చేశారు. మొన్న ఆ మధ్యన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని హరి రామ జోగయ్య తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. అప్పటినుంచి హరి రామ జోగయ్య జనసేనకు మరింత అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లనే జనసేనకు కేటాయించడంపై హరి రామ జోగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కు వరుసగా లేఖాస్త్రాలు సంధించారు. అయినా సరే పవన్ పెద్దగా పట్టించుకోలేదు. అటువంటి సలహాలు పట్టించుకోనని కూడా తేల్చి చెప్పారు. అదే సమయంలో హరి రామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ కు జనసేన టికెట్ దక్కలేదు. ఈ తరుణంలో ఆయన వైసీపీలో చేరారు.
మరోవైపు ముద్రగడ కుమారుడు సైతం వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ముద్రగడ తీరు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఆయన తప్పనిసరిగా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పిఠాపురం టికెట్ విషయంలో వైసీపీ వంగా గీతను ప్రకటించింది. అటు ముద్రగడ కుటుంబ సభ్యులు పోటీ చేస్తామన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ముద్రగడ మనస్థాపానికి గురయ్యారు. తనతో మాట్లాడడానికి ప్రయత్నించిన వైసిపి కీలక నేతలకు గట్టి హెచ్చరికలే పంపారు. ఈ తరుణంలో ఆయనకు జనసేన నేతలు టచ్ లోకి వచ్చారు. పవన్ నేరుగా వచ్చి చర్చలు జరుపుతారని.. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. కానీ ఇది జరిగి నెలలు గడుస్తున్న పవన్ పద్మనాభం ఇంటికి వెళ్లలేదు. దీంతో మనస్థాపానికి గురైన ముద్రగడ పవన్ కు లేఖ రాశారు.కానీ పవన్ పెద్దగా స్పందించలేదు.
హరి రామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిన నేపథ్యంలో.. ముద్రగడను సైతం వైసీపీలోకి రప్పించేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. పిఠాపురం అభ్యర్థిగా ఉన్న వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు రావడం విశేషం. ఆస్థానం ముద్రగడ కుటుంబానికి సర్దుబాటు చేసేందుకే ఆమెను పిలుస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే మొత్తానికిపవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం నడుస్తున్న నేపథ్యంలో.. బలమైన కాపు నేతలను వైసీపీలో చేర్పించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.