TDP: తెలుగుదేశం పార్టీ జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు సాధించింది. 18వ లోక్ సభలో ఆరు పెద్ద పార్టీగా అవతరించింది. 41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న లోక్ సభలో.. 16 మంది సభ్యులతో ఈ ఘనత సాధించింది. జాతీయస్థాయిలో టిడిపి గుర్తింపు సాధించడం ఇది మొదటిసారి కాదు. గతంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా టిడిపికి దక్కింది. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో సముచిత స్థానం దక్కించుకుంది ఆ పార్టీ. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చాన్స్ వచ్చింది.
ఇటీవల దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ముచ్చటగా ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల్లో బిజెపి సొంతంగా అధికారంలోకి రాగా.. ఇప్పుడు ఎన్ డి ఏ మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ముఖ్యంగా ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం నిలిచింది. జెడియు మరో భాగస్వామ్యపక్షంగా నిలబడింది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు ప్రాధాన్యత దక్కింది. తాజాగా లోక్సభలో సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీ ఆరో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న వైసిపి 15వ స్థానానికి పరిమితం అయ్యింది.
41 పార్టీల సభ్యులతో లోక్సభ కొలువుదీరింది. బిజెపి నుంచి 240 మంది సభ్యులు, కాంగ్రెస్ 99, సమాజ్ వాది 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22 స్థానాలు సాధించాయి. టాప్ 5 లో నిలిచాయి. 16 మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఆరో పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బిజెపికి మాత్రమే మూడంకెల స్థానాలు దక్కాయి. 34 పార్టీలకు ఏక అంకె సీట్లు వచ్చాయి. 16 పార్టీలకు కేవలం ఒక్కో సీటు మాత్రమే వచ్చింది. వైసీపీకి నాలుగు స్థానాలు వచ్చాయి. జనసేనకు రెండు సీట్లు దక్కాయి.అయితే ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు దక్కడం విశేషం. ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా, జాతీయస్థాయిలో ఆరో పెద్ద పార్టీగా నిలవడం విశేషం.
జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ తోపాటు చంద్రబాబు సైతం సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇందిరా గాంధీ హత్య సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీచాయి. కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. ఆ పార్టీ మెరుగైన సీట్లను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా విపక్షాలు తుడుచుపెట్టుకుపోయాయి. ఆ సమయంలో లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించింది టిడిపి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కూడా కీలకంగా మారింది. 1996లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిరతకు కూడా టిడిపి ఒక కారణం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టిడిపి పాత్ర కీలకం. ఆరో అతిపెద్ద పార్టీగా అవతరించి జాతీయ స్థాయిలో సైతం టిడిపి క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More