Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. అటువంటి నేత అరెస్టు భయంతో ఇప్పుడు కుటుంబ సభ్యులతో సహా పరారీ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీకాకుళం నగరంలో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని.. అసలు యజమానులు ఉండగా.. దొడ్డిదారిన కైవసం చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. ఏ క్షణం అయినా అరెస్టు ఉంటుందన్న ప్రచారంతో తమ్మినేని తన కుటుంబంతో సహా పరారీ కావడం సంచలనంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్.
* గత రెండు రోజులుగా ఇదే సంచలనం..
గత రెండు రోజులుగా శ్రీకాకుళంలో సంచలనంగా మారింది ఈ కేసు. శనివారం సాయంత్రం ఎస్పి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. తమ్మినేని ఫ్యామిలీ ఎలా ఆ భూమిని కొట్టేసింది.. అందులో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు అనేదానిపై స్పష్టతనిచ్చారు. ఈ కేసులో మిగతా వారిని అరెస్టు చూపించారు. కానీ స్పీకర్ తమ్మినేని, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్, భార్య వాణి అరెస్టు విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్న తరుణంలో.. సోమవారం వేకువ జామున కుటుంబంతో సహా అదృశ్యమయ్యారు తమ్మినేని. అప్పటివరకు అద్దె ఇంట్లో ఉండగా.. ఇంట్లో కార్లు, సెల్ ఫోన్లు ఉంచి మరి.. తమ్మినేని కుటుంబంతో సహా పరారీ అయ్యారు. అరెస్టులో జాప్యం, పరోక్ష సహకారం వంటివి ఇందులో కనిపిస్తున్నాయి. అందుకే వారు తప్పించుకున్నట్లు అర్థం అవుతోంది. అరెస్టు తప్పదన్న సమాచారం వచ్చిన తరువాత మాత్రమే తమ్మినేని ఫ్యామిలీ పరారీ అయినట్లు శ్రీకాకుళం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
* 8 మంది అరెస్ట్..
ఆ భూమికి సంబంధించి అసలు యజమాని ఉన్నారు. అయినా సరే తమ్మినేని తన అధికార దర్పంతో అలా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులు ఉండగా 8 మంది అరెస్టు జరిగింది. తమ్మినేని కుటుంబంలోని ముగ్గురు నిందితులుగా ఉన్నారు. అయితే అప్పటివరకు తమ్మినేని ఫ్యామిలీ కళ్ళ ఎదుటే ఉన్న అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో మాజీ హోం గార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, సాలిపల్లి లక్ష్మణరావు, రజిని, డాక్యుమెంట్ రైటర్ కోన పెద్దిరాజులు ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ రిజిస్ట్రేషన్ విషయంలో సాక్షులుగా సంతకాలు పెట్టారు తమ్మినేని కాలేజీలో పనిచేస్తున్న ఉపేంద్ర కుమార్, ఉపేంద్ర రావు, సాంబశివరావు, గోపాలకృష్ణలు. వీరంతా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు.





